Assembly Elections 2022: ఉత్తర ప్రదేశ్ సహా అయిదు రాష్ట్రాల ఎన్నికల నిర్వహణ కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. దేశంలోనే అతి పెద్ద రాష్టమైన ఉత్తరప్రదేశ్ సహా ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, గోవా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి షెడ్యుల్ ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి సుశీల్ చంద్ర విడుదల చేశారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల కమిషనర్లు రాజీవ్ కుమార్, అనూప్ చంద్ర పాండే లు పాల్గొన్నారు. దేశంలో కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు తగిన జాగ్రత్తలు తీసుకున్నామని సీఈసీ తెలిపారు.
Assembly Elections 2022: ఉత్తరప్రదేశ్ లో ఏడు దశలో ఎన్నికలు
ఉత్తరప్రదేశ్ లో ఏడు దశలో ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. ఫిబ్రవరి 10న తొలి దశ ఎన్నికలు జరుగనున్నాయి. పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా రాష్ట్రాల్లో ఒకే దశలో ఎన్నికలు జరగనుండగా, ఫిబ్రవరి 14న పోలింగ్ జరగనుంది. మణిపూర్ లో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. అయిదు రాష్ట్రాల్లో మార్చి 7 నాటికి పోలింగ్ ముగుస్తుంది. మార్చి 10న కౌంటింగ్ జరుగుతుంది.
తగిన జాగ్రత్తలతో ఎన్నికలు
కోవిడ్, ఓమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ, అన్ని రాష్ట్రాల ఆరోగ్య శాఖలు, ఆరోగ్య నిపుణులతో చర్చించిన తరువాతే తగిన జాగ్రత్తలతో ముందుకు వెళుతున్నామని సుశీల్ చంద్ర తెలిపారు. పోలింగ్ శాతం మరింత పెరిగేలా చూడాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అత్యంత ఆవశ్యకమైనవి కాబట్టి కరోనా పరిస్థితుల్లోనూ తప్పక ఎన్నికల ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు సీ ఈసీ వెల్లడించారు.
Read More: Modi: ఆంధ్రప్రదేశ్ తలరాతను మార్చబోతున్న మోడీ..!!