బ్యాంకులు లేదా పోస్టాఫీసుల్లో మీరు ఫిక్స్డ్ డిపాజిట్ ఏదైనా కలిగి ఉన్నారా ? అయితే ఈ వార్త మీకోసమే. ఎందుకంటే ఆ డిపాజిట్లు కలిగి ఉన్నవారు వెంటనే వాటికి గాను 15జి లేదా 15హెచ్ ఫామ్స్ను సమర్పించాల్సి ఉంటుంది. అవును.. అలా చేయకపోతే మీరు చేసిన ఫిక్స్డ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీకి టీడీఎస్ను కట్ చేస్తారు. ఆ తరువాత వచ్చే మొత్తాన్నే మీకు అందిస్తారు.
ఇక 15జి, 15హెచ్ ఫామ్స్ను సమర్పించేందుకు గాను జూలై 7వ తేదీని ఆఖరి గడువుగా నిర్ణయించారు. ఆ లోపు ఎఫ్డీలు కలిగి ఉన్న కస్టమర్లు వాటికి సదరు ఫామ్స్ను అందజేయాల్సి ఉంటుంది. లేదంటే ఆ ఎఫ్డీలపై వచ్చే వడ్డీలో నుంచి 10 శాతం టీడీఎస్ను కట్ చేస్తారు. సాధారణంగా బ్యాంకులు లేదా పోస్టాఫీసులు ఒక ఆర్థిక సంవత్సరంలో ఎఫ్డీలపై వచ్చే వడ్డీ మొత్తం నిర్ణీత లిమిట్ దాటితే అందులోంచి 10 శాతం టీడీఎస్ను కట్ చేసుకుంటాయి. అందువల్ల డిపాజిటర్లు ముందుగానే 15జి లేదా 15 హెచ్ ఫామ్లను సమర్పించాల్సి ఉంటుంది. అయితే సాధారణ పౌరులు 15జి ఫామ్స్ను, సీనియర్ సిటిజెన్లు 15హెచ్ ఫామ్ను సమర్పించాలి.
అయితే ఎవరైనా 15జి, 15హెచ్ ఫామ్స్ను సమర్పించలేకపోతే.. అప్పుడు వడ్డీ నుంచి 10 శాతం టీడీఎస్ను కట్ చేసినా.. దాన్ని డిపాజిటర్లు మళ్లీ వెనక్కి పొందేందుకు అవకాశం ఉంటుంది. కానీ అందుకు ఐటీ రిటర్న్స్ను దాఖలు చేయాలి. అందులో క్లెయిమ్ చేసుకుంటే ఎఫ్డీ వడ్డీలో కట్ అయిన 10 శాతం టీడీఎస్ మొత్తాన్ని మళ్లీ వెనక్కి పొందవచ్చు. ఇక ఎస్బీఐ కస్టమర్లు అయితే ఆయా ఫామ్స్ను సులభంగా సబ్మిట్ చేయవచ్చు. అందుకు బ్యాంకుకు కూడా వెళ్లాల్సిన పనిలేదు. ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్లోకి వెళ్లి అందులో ఉండే ఇ-సర్వీసెస్ అనే విభాగంలోకి వెళ్తే సరిపోతుంది. అందులో నుంచే నేరుగా 15జి, 15హెచ్ ఫామ్లను సబ్మిట్ చేయవచ్చు.