BJP: పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం ఉన్నప్పటికీ దానిలో ఉన్న లొసుగులను ఆసరాగా చేసుకుని ఒక పార్టీ నుండి గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు మరో పార్టీకి జంప్ అవ్వడం దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో జరుగుతూనే ఉంది. ఈ సందర్భంలో ప్రజా ప్రతినిధులను కోల్పోయిన పార్టీలు ప్రత్యర్ధి పార్టీలపై సంతలో పశువులను కొనుగోలు చేసినట్లు ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని ఆరోపించడం, నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్టీ ఫిరాయించినట్లు వారు చెప్పడం సహజమే. ఎమ్మెల్యేల పార్టీ మార్పుల నేపథ్యంలో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారడం, వాటిపై ఆరోపణలు రావడం జరుగుతుంటోంది. కానీ వీటికి సాక్షాలు, ఆధారాలు ఏమీ ఉండవు. అయితే కర్నాటకలో అధికార బీజేపీ ఎమ్మెల్యే ఆ పార్టీ ఇరుకునపడే విధంగా సంచలన వ్యాఖ్యలు చేయడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. అధికార బీజేపీని విమర్శించడానికి కాంగ్రెస్ పార్టీకి ఒక ఆయుధం అందించినట్లు అయ్యింది.
కర్నాటకలో కాంగ్రెస్ – జేడీఎస్ ప్రభుత్వం కూలిపోయిే ముందు కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరడానికి తనకు డబ్బులు ఆఫర్ చేసినట్లు బీజేపీ ఎమ్మెల్యే శ్రీమంత్ బాలాసాహెబ్ పాటిల్ వ్యాఖ్యలు చేయడం తీవ్ర సంచలనం అయ్యింది. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను డబ్బులు తీసుకోకుండానే బీజేపీలో చేరినట్లు వెల్లడించారు. పార్టీలో చేరడానికి తనకు డబ్బులు ఆఫర్ చేశారు, తాను ఎంత డబ్బులు అయినా అడిగే అవకాశం ఉన్నా తాను డబ్బులు కోరుకోలేదు. ప్రజలకు సేవ చేసేందుకు గానూ మంత్రి పదవి కోరానని చెప్పారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం తనకు మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదో అర్థం కాలేదన్నారు. తదుపరి మంత్రి వర్గ విస్తరణలో అవకాశం కల్పిస్తామని సీఎం బసవరాజు బొమ్మాయ్ హామీ ఇచ్చారని శ్రీమంత్ బాలా సాహెబ్ పాటిల్ పేర్కొన్నారు.
పాటిల్ కర్నాటకలోని కాగ్వాడ్ అసెంబ్లీ నుండి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీతో సుదీర్ఘ అనుబంధం ఉన్న పాటిల్ 2019లో బీజేపి క్యాంపుకు మారారు. అప్పటి ముఖ్యమంత్రి కుమారస్వామి నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం పతనానికి దారి తీసిన కాంగ్రెస్, జేడీఎస్ నుండి బీజేపీలో చేరిన 16 మంది ఎమ్మెల్యేలలో పాటిల్ ఒకరు.