దుబ్బాక ఉపఎన్నికలలో గెలవడంతో గ్రేటర్ ఎన్నికల్లో కూడా అదేవిధంగా గెలిచే రీతిలో తెలంగాణ బీజేపీ నేతలు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఎలాగైనా హైదరాబాద్ మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలని ప్రతి అవకాశాన్ని వాడుకుంటూ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నరు. అయితే కొన్ని చోట్ల బిజెపి నేతలు అతిగా మాట్లాడుతూ నోరు జారుతూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి గురవుతున్నాయి.
ముఖ్యంగా తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ గ్రేటర్ ఎన్నికల గురించి మీడియాతో మాట్లాడిన సందర్భం లో నగరంలో వచ్చిన వరదల గురించి ప్రస్తావిస్తూ.. వరద బాధితులకు పాతికవేలు ఇవ్వటమే కాక వరదలలో ఎవరైతే బండి పోగొట్టుకున్నారో వారికి బండి, కారు పోతే కారు ఇస్తానన్నారు. అంతే కాదు.. హెల్మెట్ లేకపోయినా, రాంగ్ రూట్ లో వెళ్లినా, ట్రిపుల్ రైడింగ్ అయినా ఆ చలాన్లన్నీ జీహెచ్ఎంసీ కడుతుందని కూడా చెప్పారు.
దినీతో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ గ్రేటర్ ఎన్నికల రోడ్ షోలలో పదే పదే ప్రస్తావిస్తూ.. బండి సంజయ్ పై సెటైర్లు వేస్తున్నారు. ఇలాంటి వాళ్లను పట్టించుకో కూడదు అని తెలపడంతో సంజయ్ వ్యాఖ్యలు గ్రేటర్ వాసులకు చాలా సిల్లీగా అనిపిస్తున్నట్లు తెలుస్తోంది. మరోపక్క పావురాలగుట్ట వ్యవహారం అంటూ రఘునందన్ రావు చేసిన వ్యాఖ్యలు బిజెపి పార్టీకి పెద్ద తలనొప్పిగా మారటంతో.. ఆ సమయంలో రఘునందన్ రావు మీడియా ముందుకు వచ్చి మరీ వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలా నోరు జారుతూ నవ్వుల పాలవుతున్న గాని మరోసారి తాజాగా బండి సంజయ్ సర్జికల్ స్ట్రైక్ అంటూ చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో పెను దుమారాన్ని రేపుతున్నాయి. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పాతబస్తీ పై సర్జికల్ స్ట్రైక్స్ చేస్తామంటూ ఆ ప్రాంతంలో పాకిస్తాని ఓటర్లు ఉన్నారు, రోహింగ్యాలున్నారు అంటూ భారీ స్థాయిలో కామెంట్లు చేశారు. దీంతో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు గ్రేటర్ ఎన్నికల్లో పెను దుమారాన్ని రేపుతున్నాయి.