తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ నుండి ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. ఈటల రాజేందర్ ఇటీవల జరిగిన హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలుపొందారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో రఘునందనరావు విజయం సాధించారు. అంతకు ముందు నుండి గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఉన్నారు. బీజేపీ శాసనసభాపక్ష నేతగా రాజాసింగ్ ఉన్నారు. ఈటల రాజేందర్ సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అయినప్పటికీ రాజాసింగ్ మొదటి నుండి బీజేపీ నేత కావడంతో ఈటల రాజేందర్ బీజేపీ నుండి గెలుపొందినా, ఆ హోదా ఆయనకు ఇవ్వలేదు. అయితే ఇప్పుడు వివాదాస్పద వ్యాఖ్యల వివాదం కారణంగా రాజాసింగ్ పై బీజేపీ వేటు వేసింది. ఈ నేపథ్యంలో బీజేపీ శాసనసభాపక్ష నేత పదవిని ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలో సీనియర్ అయిన ఈటల రాజేందర్ అప్పగించే అవకాశాలు ఉన్నాయి.
టీఆర్ఎస్ నుండి బీజేపీలో చేరిన ఈటల రాజేందర్ కు ఆ పార్టీ మంచి ప్రాధాన్యతనే ఇస్తొంది. చేరికల కమిటీ కన్వీనర్ గా పార్టీ నియమించింది. తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ కు నేతృత్వం వహిస్తున్నారు. ఈటెల రాజేందర్ 2009 నుండి ఎమ్మెల్యేగా ఉన్నారు. కేసిఆర్ మంత్రివర్గంలో మంత్రిగానూ బాధ్యతలు నిర్వహించారు. ఇప్పుడు బీజేపీ శాసనసభాపక్ష నేత పదవి నుండి రాజాసింగ్ ను తొలగించడంతో ఈటలకు లైన్ క్లీయర్ అయ్యింది. రాజాసింగ్.. గోషామహాల్ నియోజకవర్గం నుండి 2014, 2018 ఎన్నికల్లో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక రఘునందనరావు దుబ్బాక ఉప ఎన్నికల్లో మొదటి సారి ఎమ్మెల్యేగా ఎన్నికైయ్యారు. ఈ నేపథ్యంలో బీజేపీ శాసనసభాపక్ష నేతగా రఘునందనరావు నియమితులు కానున్నారు.
మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యల కేసులో రాజాసింగ్ ను ఈ రోజు పోలీసులు అరెస్టు చేశారు. కోర్టుకు హజరుపర్చగా మెజిస్టేట్ 14 రోజులు రిమాండ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ వెంటనే రాజాసింగ్ తరపున న్యాయవాది బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా, విచారణ జరిపిన మెజిస్ట్రేట్ ఎలాంటి షరతులు లేకుండానే బెయిల్ మంజూరు చేశారు. దీంతో ఆయనను పోలీసులు ఆయనను భారీ పోలీస్ బందోబస్తు నడుమ ఇంటి వద్ద దింపారు. రాజాసింగ్ యూట్యూబ్ లో అప్ లోడ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వీడియోపై ఎంఐఎం పెద్ద ఎత్తున ఆందోళన చేసింది. సోమవారం రాత్రి నుండి మంగళవారం ఉదయం వరకూ పాత బస్తీ పోలీస్ స్టేషన్ ల వద్ద, సీపీ కార్యాలయం వద్ద ఎంఐఎం నిరసనలు వ్యక్తం చేసింది. ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో రాజాసింగ్ ను అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో పార్టీ క్రమశిక్షణా సంఘం ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. పార్టీ నుండి ఎందుకు బహిష్కరించకూడదో పది రోజుల్లో వివరణ ఇవ్వాలని పార్టీ కోరింది.