Army Chopper Crash: భారత త్రివిధ దళాధిపతి (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న ఆర్మీ హెలికాఫ్టర్ ప్రమాదంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదే క్రమంలో అధికార పార్టీ రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్య స్వామి కూడా ప్రమాదంపై అనుమానాలు వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై సుప్రీం కోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. తమిళనాడులో ఆర్మీ హెలికాఫ్టర్ కుప్పకూలిన ఘటనలో సీడీఎంస్ జనరల్ బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులిక రావత్ సహా 13 మంది మృత్యువాత పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు.
Army Chopper Crash: సుప్రీం కోర్టు జడ్జి వంటి వారి చేత విచారణ జరిపించాలి
సీడీఎస్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ కాలిపోవడంపై సందేహాలు ఉన్నాయని ఆయన అన్నారు. ఈ హెలికాఫ్టర్ గా చెప్తూ ప్రచారమవుతున్న వీడియోను తాను అత్యంత నమ్మదగిన వర్గాల ద్వారా సరిచూశాననీ, అది వాస్తవానికి సిరియన్ వైమానిక దళానికి చెందినదని, సీడీఎస్ ప్రయాణిస్తున్నది కాదని తెలిపారు. జనరల్ బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులిక, మరి కొందరు సీనియర్ మిలిటరీ అధికారులు ఎలా మరణించారనే దానిపై సందేహాలు వస్తున్నాయన్నారు. ప్రభుత్వ తప్పనిసరిగా ఓ బయటి వ్యక్తి చేత విచారణ జరిపించాలని, సుప్రీం కోర్టు జడ్జి వంటి వారి చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
సుబ్రమణ్య స్వామి మీడియాతో మాట్లాడుతూ ఈ సంఘటన తనను దిగ్భాంతికి గురి చేసిందని చెప్పారు. దేశ భద్రతకు ఇది చాలా పెద్ద హెచ్చరిక అని పేర్కొన్నారు. ఈ సంఘటనపై తుది నివేదిక ఇంకా రాలేదని, ఇప్పటికిప్పుడు ఎం చెప్పాలన్నా కష్టమని అన్నారు. అయితే తమిళనాడు వంటి సురక్షిత ప్రాంతంలో ఓ సైనిక హెలికాఫ్టర్ పేలిందని, అలా కనిపిస్తోందని అన్నారు. దీనిపై కట్టుదిట్టమైన దర్యాప్తు జరగాలని తెలిపారు. ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలన్నారు. సుప్రీం కోర్టు సీనియర్ న్యాయమూర్తి వంటి వారి చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.