యూట్యూబ్, సోషల్ మీడియాలో వార్తలు.. విశ్లేషణలు చెప్పటం వేరు.. విమర్శలు చేయటం వేరు.. ప్రశ్నించడం వేరు ? గ్రౌండ్ లెవెల్ లో రాజకీయాల చేయటం వేరు అన్న విషయం మహాసేన రాజేష్కు చాలా త్వరగానే అర్థమైనట్టు ఉంది. మహాసేన రాజేష్ టిడిపి అధినాయకత్వం మీద ఒక రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. రాజేష్ కు టిడిపి మొదటి జాబితాలో తూర్పుగోదావరి జిల్లాలోని పీ గన్నవరం టికెట్ ప్రకటించింది. రాజేష్కు టికెట్ ఇవ్వడంతో టిడిపిలోనే చాలామంది.. అటు జనసేన వర్గాలు రగిలిపోయాయి. గతంలో చంద్రబాబుతో పాటు తెలుగుదేశం పార్టీని.. పవన్ కళ్యాణ్ ను.. జనసేన ను రాజేష్ దారుణంగా విమర్శించారు.
అలాగే హిందువులపై.. హిందూ దేవుళ్లను విమర్శిస్తూ రాజేష్ చాలా దారుణంగా వ్యాఖ్యలు చేశారు. రాజేష్ పి గన్నవరంలోకి ఎంటర్ కాకుండానే ఆయన సీటు మార్చకపోతే తమ అంత వ్యతిరేకంగా చేసి రాజేష్ ను చిత్తుగా ఓడిస్తామంటూ టిడిపి – జనసేన నేతలు సంయుక్తంగా కలిసి ప్రకటనలు చేశారు. కొన్ని సామాజిక వర్గాలకు కూడా రాజేష్ మీద విమర్శలు గుప్పించాయి. ఆయనకు టికెట్ ఇవ్వవద్దని పొత్తులో భాగంగా టిడిపి లేదా జనసేనలో ఎవరికి సీటును ఇచ్చినా తాము గెలిపించుకుంటామని ప్రకటించాయి. ఈ విమర్శలతో రాజేష్ కూడా ఒక అడుగు వెనక్కు వేసి మీడియా ముందుకు వచ్చి తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు.
దీంతో రాజేష్ ఎన్నికలకు దూరంగా ఉంటారని అందరూ అనుకున్నారు. ఇప్పుడు చూస్తే రాజేష్ ఇంకా రేసు లోనే ఉన్నాను అని అంటున్నారు. తనకు సీటు లేదని చంద్రబాబు ఎక్కడా చెప్పకుండానే పి గన్నవరం సీటుని జనసేనకు ఇవ్వాలనుకోవడం చాలా దారుణం అని అంటున్నారు. గన్నవరంలో ఐవీఆర్ఎస్ కాల్స్ పేరుతో సర్వేలు చేస్తున్నారని సీటు జనసేనకు ఇస్తున్నట్టు తెలిసిందని రాజేష్ మండిపడుతున్నారు.. నాకు సీటు ఇచ్చి మరి ఈ టార్చర్ ఏంటి అని రాజేష్ ప్రశ్నిస్తున్న పరిస్థితి.
తాను ఈరోజుకి పి గన్నవరం టిడిపి ఇన్చార్జిగా ఉన్నాను అని రాజేష్ చెబుతున్నారు. నాకు చంద్రబాబు సీటు ఇవ్వను.. పక్కన ఉండి అని చెప్పేంతవరకు కూడా జనసైనికులు ఆగరా అంటూ రాజేష్ మండిపడుతున్నారు. ఇదంతా తనను అవమానించే ప్రక్రియలో భాగం అని రాజేష్ వాపోతున్నారు. బిజెపి టిడిపి – జనసేన పొత్తులో ఉన్నాయి.. జనసేన అభ్యర్థిని పెట్టమని ప్రజలకు కాల్స్ వెళ్తున్నాయి కదా ఇదేమిటని ఆయన ప్రశ్నిస్తున్నారు. 15 రోజుల క్రితం వరకు తాను ప్రశాంతంగా ఉన్నానని ఇప్పుడు సీటు ఇచ్చి ఇలా ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అంటూ రాజేష్ వాపోతున్నారు.
అయితే రాజేష్ అభిమానులు మాత్రం చంద్రబాబు – పవన్ తమ నాయకుడికి సీటు ఇచ్చినట్టే ఇచ్చి గేమ్ ఆడుతున్నారని మండిపడుతున్నారు.