తెలుగు సినీ ప్రముఖులు చిరంజీవి, నాగార్జున మరోమారు కీలక పరిణామంతో వార్తల్లోకి ఎక్కారు. ఓ వైపు బిగ్ బాస్తో బిజీ బిజీగా గడుపుతున్న నాగార్జున, మరోవైపు మెగాస్టార్ చిరంజీవి తెలంగాణ సీఎం కేసీఆర్ను కలిశారు.
ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల దెబ్బతిన్న హైదరాబాద్ నగరంలో ప్రభుత్వం చేపట్టిన సహాయ, పునరావాస కార్యక్రమాలకు తమ వంతు సాయంగా పలువురు శనివారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి చెక్కులు అందించారు. మై హోమ్స్ గ్రూపు పక్షాన ఆ సంస్థ డైరెక్టర్ రామ్ రూ.5 కోట్ల చెక్కు అందించారు. వీరితో పాటుగా సినీ నటుడు చిరంజీవి కోటి రూపాయల చెక్కును అందించారు. సినీ నటుడు నాగార్జున రూ.50 లక్షల చెక్కును అందించారు.
కేంద్రంపై కేసీఆర్ ఫైర్
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇటీవల కేంద్ర ప్రభుత్వ వరద సాయంపై ప్రస్తావన వచ్చింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల రాష్ట్రానికి ఎంతో నష్టం జరిగినా కేంద్ర ప్రభుత్వం ఒక్క నయాపైసా కూడా సాయం అందలేదని ఆర్థిక శాఖ అధికారులు తెలిపారు. దేశంలోని అతి పెద్ద నగరాల్లో ఒకటైన హైదరాబాద్ నగరానికి నష్టం జరిగితే కూడా స్పందించి సాయం చేయకపోవడం దారుణమన్నారు.
ఆఫీసర్లతో కేసీఆర్ ఏమన్నారంటే….
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కార్యాలయం విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ‘‘ఇటీవల కురిసిన వర్షాల వల్ల రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో వరదలు ముంచెత్తాయి. దీని వల్ల అనేక రంగాలకు తీవ్ర నష్టం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా పంట నష్టం కూడా జరిగింది. దాదాపు 5వేల కోట్ల వరకు నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా వేసి, రూ.1350 కోట్లను తక్షణ సాయంగా అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి అక్టోబర్ 15న లేఖ రాశారు. వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టంపై రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాన మంత్రి దిగ్భాంతి కూడా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తో వారు స్వయంగా మాట్లాడి పరిస్థితి తెలుసుకున్నారు. కేంద్ర బృందం కూడా రాష్ట్రంలో పర్యటించి, పరిస్థితిని స్వయంగా చూసింది. ఇంత జరిగిన తర్వాత కేంద్రం నుంచి ఎంతో కొంత సాయం అందుతుందని ఆశించాం. కానీ కేంద్రం నుంచి ఒక్క రూపాయి కూడా సాయం అందలేదు’’ అని ఆర్థిక శాఖ అధికారులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వానివి శుష్క ప్రియాలు, శూన్య హస్తాలే అనే విషయంలో మరోసారి నిరూపణ అయిందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. వర్షాలు, వరదల వల్ల భారీగా పంట నష్టం, ఆస్తి నష్టం జరిగినా ఒక్క రూపాయి కూడా సాయం అందించకపోవడం కేంద్ర ప్రభుత్వ వైఖరిని తేటతెల్లం చేస్తుందని విమర్శించారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!