గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు సినీ గ్లామర్ కూడా తోడైంది.తెలంగాణ రాష్ట్ర సమితి తరపున ప్రముఖ మాటల రచయిత పోసాని కృష్ణమురళి, సినీ దర్శకుడు ఎన్ శంకర్ లు వకాల్తా పుచ్చుకున్నారు.ఇందులో శంకర్ తెలంగాణవాది.
ఆయన గతంలో జై బోలో తెలంగాణా అనే సినిమాను కూడా తీశారు.అయితే ఆంధ్ర ప్రాంతానికి చెందిన పోసాని కృష్ణమురళి టీఆర్ఎస్ కి జై కొట్టడమే ఇక్కడ విశేషం.నిక్కచ్చిగా నిర్మొహమాటంగా మాట్లాడే పోసాని కృష్ణమురళి ముందుగా ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయ ఆరంగ్రేటం చేశారు.ఆ పార్టీ తరపున చిలకలూరిపేట అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయారు.తదుపరి నిన్నమొన్నటివరకు వైసీపీకి మౌత్ పీస్ గా మారారు.ఈ మధ్యే ఆంధ్రలో కూడా ఆయన వాయిస్ లో తేడా వచ్చింది.ముఖ్యంగా అమరావతి రైతుల విషయంలో జగన్ ప్రభుత్వ వైఖరి పోసాని కి రుచించక కొన్ని విమర్శలు చేయడం జరిగింది.ఇప్పుడు అదే పోసాని కృష్ణమురళి తెలంగాణాలో ప్రత్యక్షమయ్యారు. దర్శకుడు శంకర్ కృష్ణమురళి కలిసి ప్రెస్ క్లబ్బులో విలేకరుల సమావేశం పెట్టి టీఆర్ఎస్ కి మద్దతుగా మాట్లాడారు.
వెంటనే బీజేపీ తరపున ఇద్దరు సినీ ప్రముఖులు రంగంలోకి దిగారు.అలనాటి హీరోయిన్ కవిత ,క్యారెక్టర్ ఆర్టిస్టు సీవీఎల్ నరసింహారావులు బిజెపి కార్యాలయంలో విలేఖరుల సమావేశం పెట్టి భారతీయ జనతా పార్టీ తరపున తమ వాణి వినిపించారు.వీరిలో కవిత తెలుగుదేశం పార్టీ నుండి బిజెపిలోకి వలస వచ్చారు.ఇక సివిఎల్నరసింహారావు లోక్సత్తాకు గతంలో అధికార ప్రతినిధిగా పనిచేశారు.వీరిద్దరూ ఇప్పుడు బీజేపీ తరపున మాట్లాడుతూ దర్శకుడు ఎన్ శంకర్ ను టార్గెట్ చేశారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి భూములు పొందినందున శంకర్ అటువైపు వకాల్తా పుచ్చుకున్నారని ఆరోపించారు.
అయితే ఇదే సమయంలో వారు పోసానిని ఒక్క మాట కూడా అనకపోవడం ఇక్కడ గమనార్హం.బహుశా పోసాని కృష్ణమురళి మాటల తూటాలు ఎలా పేలుతాయో వారికి బాగా తెలుసు కాబట్టే ఈ విషయంలో జాగ్రత్త పడ్డారని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.ఇప్పటికైతే అటువైపు ఆ ఇద్దరూ ఇటువైపు ఈ ఇద్దరే సినీ ప్రముఖులు రంగంలోకి వచ్చినప్పటికీ రానున్న రోజుల్లో మరికొందరు అగ్ర శ్రేణి నటీనటులు కూడా గ్రేటర్ ప్రచారంలో పాల్గొనే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది.అయితే ఇటీవల సినీ పరిశ్రమకు ముఖ్యమంత్రి కెసిఆర్ అనేక వరాలు ఇచ్చినందువల్ల మెజారిటీ టాలీవుడ్ టీఆర్ఎస్ వైపే ఉందని చెప్పవచ్చు.