వైసీపీ గుర్తుపై గెలిచిన ఎంపీ రఘురామకృష్ణ రాజు సొంత పార్టీపైనే నిప్పులు చెరుగుతున్నారు. ఎంపీ వ్యవహారాన్ని సునిశితంగా పరిశీలిస్తున్న పార్టీ ఇక ఆయన విషయంలో ఉపేక్షించడం ఏమంత మంచిది కాదనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. రఘురామ మాటలు, వ్యవహారం చూసిన ఎవరికైనా ఆయన వైసీపీకి దాదాపు దూరం అయినట్టే తెలుస్తుంది.
సొంత పార్టీ నేతలపై వ్యతిరేక వ్యాఖ్యలు, పార్టీ విధానాలపై వ్యంగ్యాస్త్రాలు, ప్రభుత్వ నిర్ణయాలపై ఎత్తిపొడుపులతోపాటు ఏకంగా సీఎం జగన్ నే టార్గెట్ చేయడం.. వైసీపీపై రఘురామరాజు తీరుకు పరాకాష్టగా నిలుస్తున్నాయి. జగన్ ను ఎన్ని విధాలుగా టార్గెట్ చేసినా ఆయన లైట్ తీసుకున్నారు. వేచి చూద్దాం.. అనే ధోరణిలో సీఎం ఉంటే ఎంపీ మాత్రం పార్టీపై, ప్రభుత్వంపై బరితెగింపుకు పాల్పడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో హీటెక్కిస్తున్న మూడు రాజధానుల అంశంపై రఘురామ మాట్లాడటాన్ని మాత్రం జగన్ ఏమాత్రం ఉపేక్షించడం లేదని తెలుస్తోంది. టీడీపీకి, చంద్రబాబుకు వత్తాసు పలుకుతూ రఘురామ చేస్తున్న వ్యాఖ్యలు సీఎంకు చికాకు తెప్పించాయని అంటున్నారు. ఏకంగా రాజధాని మార్పు కావాలంటే పార్లమెంటు ఆమోదం ఉండాలని వ్యాఖ్యలు చేయడం ప్రభుత్వ వ్యతిరేక వ్యాఖ్యలుగా భావిస్తున్నారని అంటున్నారు. ఎన్ని విషయాల్లో సీఎం సహించినా రాజధాని విషయంపై రఘురామ వ్యాఖ్యలు చేయడం సీఎం జగన్ కు కోపం తెప్పించిందని అంటున్నారు.
వీటన్నింటినీ నిశితంగ పరిశీలించిన సీఎం జగన్ కు కూడా రఘురామకృష్ణ రాజును పార్టీలో ఉంచడం శ్రేయస్కరం కాదనే భావిస్తున్నట్టు తెలుస్తోంది. రఘురామ ఎన్ని వ్యాఖ్యలు చేసినా జగన్ ఒకింత సహనంగా ఉన్నారనే చెప్పాలి. దాదాపు ఏడాది కాలంగా రాజధాని అంశంపై వాదనలు జరుగుతున్నా మాట్లాడని రఘురామ ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. టీటీడీలో అన్యమత ప్రచారం, అయోధ్యలో రామాలయం నిర్మాణం.. వంటి అంశాల్లో ఏకంగా మతాలపై మాట్లడుతూ అలజడి రేపే ప్రయత్నం చేశారు. వీటన్నింటినీ సమర్ధవంతంగా తిప్పికొట్టింది ప్రభుత్వం.