ఒక పక్క రాష్ట్రంలో అవినీతి రహిత పాలన సాగించాలని ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృత నిశ్చయంతో ముందుకు సాగుతుండగా అయన ఆశయాలకు తూట్లు పొడిచే విధంగా వైకాపా నేతలు వ్యవహరిస్తున్నారుట. ఇసుక వ్యాపారం, భూముల కొనుగోలు తదితర విషయాల్లో అధికార పార్టీ నేతల హస్తం ఉందని అదే పార్టీకి చెందిన నర్సాపురం ఎంపీ రఘు రామ కృష్ణంరాజు ఆరోపించిన విషయం తెలిసిందే. తాజాగా సీఎం సొంత జిల్లా కడపలోనూ అధికార పార్టీ నేతలు.. కాంట్రాక్టు పనుల్లో పర్సెంటేజీల బాగోతంకు తెరలేపినట్లు సమాచారం.
ముఖ్య మంత్రి వైఎస్ జగన్ ప్రజా ధనం ఆదా చేసేందుకు రివర్స్ టెండరింగ్ విధానానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. సాగునీటి ప్రాజెక్టులు మొదలుకుని అన్నింటా రివర్స్ టెండరింగ్ పక్కాగా అమలు చేస్తుండటంతో ఇప్పటికే కొన్ని వందల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదా అయ్యాయి. అయితే సీఎం జగన్ సొంత జిల్లా కడపలో కొంత మంది నేతలు అభివృద్ధి పనులలో పర్సెంటేజీలు పంచుకోవడానికి సిద్దపడ్డారుట.
విషయంలోకి వస్తే…కడప కార్పొరేషన్ కు కేంద్ర ప్రభుత్వం 14వ ఆర్థిక సంఘం నిధులను కేటాయించింది. ఈ నిధులను మెరుగైన తాగునీటి సరఫరా, రోడ్లు, డ్రైనేజీ కల్వర్టులు, బీటీ రోడ్లు తదితర నిర్మాణాలకు వెచ్చించాల్సి ఉంది. కార్పొరేషన్ పరిధిలో 32 కోట్ల 46 లక్షల వ్యయంతో 221 పనులను చేపట్టాలని అధికారులు అంచనాలు సిద్ధం చేశారు. పనులకు సంబంధించి ఈ నెల 5 న టెండర్లను ఆహ్వానించారు. ఒక్కోపని అంచనా వ్యయం 5 లక్షల నుంచి 60 లక్షల వరకు ఉంది. అయితే ఈ నిధులపై నగరానికి చెందిన ఇద్దరు వైకాపా కీలక నేతలు కన్నేశారని అంటున్నారు. టెండరు నిర్వహిస్తే కాంట్రాక్టర్లు పోటీపడి లెస్ కు దాఖలు చేసే అవకాశం ఉంది. దీని వల్ల వారికి ప్రయోజనం ఏముందని భావించిన వారు కడపకు చెందిన కొంత మంది కాంట్రాక్టర్లతో సమావేశం ఏర్పాటు చేసి పోటీలు పడి లెస్ లకు టెండరు వేయవద్దని సూచించారట. కాంట్రాక్టర్ లు అందరూ రింగ్ అయితే అందరికీ పనులు వచ్చేలా చూస్తామని భరోసా ఇస్తూ పర్సెంటేజీలు మాత్రం తమకు ఇవ్వాలని చెప్పారుట. ఆన్ లైన్ ద్వారా బయటి వ్యక్తులు ఎవరైనా లెస్ కు టెండరు వేస్తే ఎలా అని కొందరు కాంట్రాక్టర్లు సందేహం వ్యక్తం చేయగా వేరే వాళ్లు ఇక్కడకు వచ్చి పనులు చేయడం అంత సులభం కాదని, ఒక వేళ చెప్పినా వినకుండా ఎవరైనా టెండరు వేస్తే ఎలా రద్దు చేయాలో తమకు తెలుసు అనీ, ఒకవేళ వేసినా రకరకాల అడ్డంకులు సృష్టిస్తామనీ, టెండరు ఎవరూ వేయకుండా తాము చూస్తామని అభయం ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే కడప కార్పొరేషన్ లో 120 మంది వరకు రిజిస్టర్డ్ కాంట్రాక్టర్లు ఉండగా సమావేశానికి 20 మంది మాత్రమే వచ్చినట్లు తెలుస్తోంది. వారి మధ్య పర్సెంటేజీలు డీల్ కు కాంట్రాక్టర్లు సుముఖత వ్యక్తం చేయడంతో ఎవరెవరికి ఎన్నెన్ని పనులు ఇవ్వాలనే దానిపై పలువురు మాజీలతో కమిటీ కూడా ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఈ తతంగం సీఎం వైఎస్ జగన్ ఆశయానికి తూట్లు పొడిచే విధంగా ఉందని పలువురు గుసగుసలాడుకుంటున్నారు.