CM YS Jagan: రెండు రోజుల తిరుమల పర్యటన ముగించుకొని సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి తాడేపల్లికి తిరుగు ప్రయాణం అయ్యారు. తిరులేశుని బ్రహ్మోత్సవాల్లో నిన్న స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం జగన్ నేటి ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ మహాద్వారం వద్ద టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈఓ జవహర్ రెడ్డి లు సీఎం జగన్ కు స్వాగతం పలికారు. సీఎం జగన్ శ్రీవారి ధ్వజ స్తంభానికి నమస్కరిస్తూ ఆలయంలోకి ప్రవేశించి శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం తులాభారం వద్దకు చేరుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తన బరవుకు సమానంగా స్వామివారికి 78 కిలోల బియ్యం సమర్పిచారు. తరువాత రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం చేశారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈఓ జవహార్ రెడ్డి లు తీర్ధ ప్రసాదాలు అందజేశారు.
CM YS Jagan: ఎస్వీబీసీ కన్నడ, హింధీ ఛానళ్ల ప్రారంభం
తదుపరి శ్రీవెంకటేశ్వర భక్తి ఛానల్ కు సంబంధించి కన్నడ, హిందీ ఛానళ్లను సీఎం జగన్ ప్రారంభించారు. అదే విధంగా తిరుమలలో రూ.10 కోట్లతో శ్రీవారి ఆలయం ఎడమ వేపున ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నూతనంగా నిర్మించిన బూందీ పోటు భవనాన్ని జగన్ ప్రారంభించారు. ఆ తరువాత సిఎం జగన్ అన్నమయ్య భవన్ లో రైతు సాధికార సంస్థ, టీటీడీ మధ్య జరిగిన ఒప్పందం కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎం జగన్ సమక్షంలో టీటీడీ, రైతు సాధికార సంస్థ మధ్య ఎంవోయు కుదిరింది. టీటీడీ 2022 డైరీలు, క్యాలెండర్లను జగన్ ఆవిష్కరించారు. అంతకు ముందు బర్డ్ ఆస్పత్రి వద్ద టీటీడీ సహకారంతో రూ.64 కోట్లతో నిర్మించిన బాలల ఆరోగ్య వరప్రదాయని శ్రీ పద్మావతి చిన్న పిల్లల హృదయాలయాన్ని ప్రారంభించారు. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు ఏపి ప్రభుత్వం ఆరోగ్య శ్రీ ద్వారా ఇక్కడ ఉచిత వైద్య సేవలు అందించనుంది. డిసెంబర్ మొదటి వారం నుండి శస్త్ర చికిత్సలు మొదలుకానున్నాయి. అలాగే అలిపిరి నుండి తిరుమల వరకు పునర్నిర్మించిన నడక మార్గం పై కప్పును కూడా సీఎం జగన్ ప్రారంభించారు.
రేణిగంట విమానాశ్రయం నుండి తిరుగు ప్రయాణం
తదుపరి శ్రీపద్మావతి అతిధి గృహన నుండి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని తాడేపల్లికి తిరుగు ప్రయాణం అయ్యారు. ఈ కార్యక్రమాల్లో సీఎం జగన్ వెంట దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని, నారాయణ స్వామి, నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, చెల్లుబోయిన వేణుగోపాల్, ఐటీ శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు ఉన్నారు.
కాగా స్వామి వారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాల సమర్పణను సీఎం జగన్ దంపత సమేతంగా కాకుండా ఒక్కరే సమర్పించడం పట్ల ఆక్షేపణలు వ్యక్తం అవుతున్నాయి. గతంలోనూ సీఎం జగన్ ఒక్కరే ఉత్సవాల్లో పాల్గొని పట్టుపస్త్రాలు సమర్పించారు. ఈ సారి అయినా జగన్ దంపత సమేతంగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించాలని జనసేన నాయకులు విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే.