(హైదరాబాద్ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
తెలంగాణ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధ్యక్షుడుగా, పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ బాధ్యతలు చేపట్టిన నాటి నుండి రాష్ట్రంలో నూతన టీమ్ యాక్టివ్ అయిన విషయం తెలిసిందే. అధికార టీఆర్ఎస్ పార్టీపై గతంలో కంటే దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఈ పరిణామాల క్రమంలో పాత నేతలకు. కొత్త నేతలకు మధ్య కొంత గ్యాప్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల కమలనాధుల మధ్య ఉన్న వర్గపోరు బహిర్గతం అయినట్లు చెబుతున్నారు.
పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై ఇప్పటి వరకూ రెండు సార్లు పోలీసులు దాడి చేసి అరెస్టు చేశారు. ఈ సమయాల్లో రాష్ట్ర పార్టీకి పెద్ద దిక్కు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గట్టిగా స్పందించలేదని ఆ పార్టీలోని బండి సంజయ్ వర్గీయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ అధ్యక్షుడికి అవమానం జరిగినా పార్టీలోని కొందరు సీనియర్లు అంతగా స్పందిచకపోవడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కమలనాధుల్లోనే కొందరు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించే వారు ఉన్నారని కూడా ప్రచారం జరుగుతోంది. ఈ కారణంగానే నూతన టీమ్ అధికార పార్టీపై చేస్తున్న పోరుకు సహకరించడం లేదని ఆ పార్టీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఒ పక్క రాబోయే అసెంబ్లీ ఎన్నికల నాటికి టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా ఎదగాలని బీజేపీ నేతల కలలు కంటున్నారు. అయితే కమల దళంలోని అంతర్గత వైరుధ్యాల మూలంగా ముందుకు వెళ్లలేని పరిస్థితి ఉందని టాక్. మరో పక్క కాంగ్రెస్ పార్టీ నుండి బీజేపీలో చేరిన మాజీ మంత్రి డీకె అరుణకు జాతీయ స్థాయిలో ప్రాధాన్యత పెరగడం ఆ పార్టీలో కొందరు జీర్ణించుకులేకపోతున్నారుట. రాష్ట్రంలో పార్టీ బలోపేతం కావాలంటే పాత, కొత్త నేతలు అందరూ కలిసి ప్రయాణం చేస్తేనే సాధ్యమవుతుందని లేకుంటే ఉనికిని చాటుకోవడం కూడా కష్టమే అవుతుందని ఆ పార్టీ అభిమానుల్లో వ్యక్తం అవుతోంది.