పంజాబ్ పంచాయతీ ఎన్నికలలో అధికార కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. దాదాపు అన్ని పంచాయతీలనూ ‘చే’ జిక్కించుకుంది. కాగా రిగ్గింగ్, బూత్ ల స్వాధీనం వంటి అక్రమాలకు పాల్పడి కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని ప్రధాన ప్రతిపక్షం శిరోమణి అకాలీదళ్ విమర్శించింది. భారత ప్రజాస్వామ్యంలో ఇదొక చీకటి రోజని పేర్కొంది. కాగా పంజాబ్ కాంగ్రెస్ పార్టీ పంచాయతీ సభ్యులు, సర్పంచ్ లుగా ఎన్నికైన వారికి అభినందిస్తూ ట్వీట్ చేసింది. గ్రామాల అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించింది.
13, 276 సర్పంచ్, 83, 831 పంచాయతీ సభ్యుల ఎన్నుకొనేందుకు జరిగిన ఎన్నికలలో 4,363 సర్పంచ్, 46, 754 పంచాయతీ సభ్యుల ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. ఈ ఎన్నికలలో ప్రధాన విపక్షం శిరోమణి అకాలీదళ్, మరో విపక్షం ఆమ్ ఆద్మీ పార్టీలు ఘోరంగా దెబ్బతిన్నాయి. ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ హైజాక్ చేసిందని ఆ పార్టీలు విమర్శించాయి.