Cm Kcr: కేసీఆర్ Cm Kcr తెలంగాణ రాజకీయాల్లో ఉద్యమం నాటి నుంచీ.. అధికారం చేపట్టిన తర్వాత.. ఇప్పుడు కూడా ఆయన తీరు భిన్నమే. ఇటివలే కేసీఆర్ కరోనా బారిన పడి చికిత్స తీసుకున్న అనంతరం కోలుకున్నారు. పరీక్షల్లో పూర్గిగా ఫిట్ అయ్యాక నిన్న ప్రగతి భవన్ కు చేరుకుని కరోనా, వ్యాక్సనేషన్ పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. సమీక్షలో ముఖానికి మాస్కు పెట్టుకున్నారు. కానీ.. ఆయన మాస్కు ధరించిన విధానమే ఇప్పుడు విమర్శలకు తావిస్తోంది. సమీక్షలో సీఎస్ సహా ఉన్నతహోదాలో ఉన్న అధికారులు 14 మంది వరకూ హాజరయ్యారు. అందరూ మాస్కులు ధరించారు. కేసీఆర్ కూడా ధరించారు. కానీ.. ముక్కు, నోటి కిందకు మాస్కు ధరించి ఉన్నారు.
ప్రస్తుతం మాస్కు విధిగా ధరించాల్సిన పరిస్థితి. అందులోనూ మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా ఉండాల్సిందే. కానీ.. ఆ ఫొటోలో సీఎం అలా లేరు. సమీక్ష ఆద్యంతం ఇలానే ఉన్నారో.. లేక కాసేపు అలా మాస్కు నోటి కిందకు ధరించారో కానీ.. ఈ ఫొటోనే కొన్ని పత్రికల్లో వచ్చింది. అసలే.. కరోనా నుంచి కోలుకుని వచ్చారు. ప్రజలకు చేయాల్సిన సూచనలు, చెప్పాల్సిన జాగ్రత్తలు, ప్రభుత్వపరంగా తీసుకోవాల్సిన చర్యలపై నిర్వహిస్తున్న సమీక్షలో సాక్షాత్తూ సీఎం ఇలా కనిపించడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. సాగర్ ఉప ఎన్నికల ప్రచార సభలో, పార్టీ సమావేశంలో మాస్కు లేకుండానే కనిపించారు. ఆ తర్వాతే ఆయనకు కరోనా వచ్చింది. ఇప్పుడు కోలుకున్నారు.
కరోనా నుంచి కోలుకున్న ఎవరిలోనైనా.. ఆ వైరస్ శరీరం నుంచి పూర్తిగా వెళ్లిందని చెప్పలేం. దీంతో వారు మరింత జాగ్రత్తగా ఉండాలినేది తెలిసిన విషయమే. దీని వలన చుట్టుపక్కల వారూ సేఫ్ ఫీల్ అవుతారు. గతేడాది కరోనాపై అసెంబ్లీలో సీఎం చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ వైరల్ అవుతాయి. ఓపక్క హైకోర్టు ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేస్తూనే ఉంది. మరోపక్క తనయుడు కేటీఆర్ కూడా కరోనా బారిన పడ్డారు. ఓపక్క మాస్కులు విధిగా ధరించాలి.. రెండు మాస్కులు ధరించాలి.. అని ప్రభుత్వమే చెప్తుంటే సీఎం సాబ్ ఇలా మాస్క్ నోటి కింద పెట్టుకున్నట్టుగా కనిపించడం విడ్డూరమే. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో కూడా వైరల్ అయింది.