ప్రముఖ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి గతంలో తీసిన ఒక సినిమాలో తనికెళ్ల భరణి హైదరాబాద్లోని రవీంద్రభారతి ,చార్మినార్ తదితరాలను ఎమ్మెస్ నారాయణ బ్రహ్మానందంలకు అమ్మేసి మోసగిస్తాడు.
అప్పట్లో అది అందరికీ బాగా వినోదం పంచింది.సినిమా కూడా సూపర్ హిట్టయింది.అదే తరహాలో ఇప్పుడు రియల్ సంఘటన జరగటం దేశాన్ని కుదిపేస్తోంది.ప్రముఖ ఆన్లైన్ షాపింగ్ సంస్థ ఓఎల్ఎక్స్ లో వచ్చిన ఈ ప్రకటన అందర్నీ విస్మయపరిచింది.వివరాల్లోకి వెళితే కేటుగాళ్లు బరి తెగించారు. ఆన్లైన్లో ఏకంగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆఫీస్నే అమ్మకానికి పెట్టారు. సదరు పోస్టు ఓఎల్ఎక్స్(OLX)లో దర్శనమివ్వడంతో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళ్తే.. వారణాసిలోని మోదీ ఎంపీ కార్యాలయాన్ని విల్లాగా పేర్కొంటూ పూర్తి వివరాలతో పాటు ఫోటోలను కూడా జతచేసి కేటుగాళ్లు OLX వెబ్సైట్లో ప్రకటన ఇచ్చారు.
సదరు బిల్డింగ్ 6500 చదరపు గజల్లో ఉందని సైట్లో పొందుపరిచారు. ఇక ఈ తతంగం మొత్తం వారణాసి పోలీసుల దృష్టికి వెళ్ళింది. ఈ వ్యవహారంపై వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆ పోస్టును తొలగించడంతో పాటు దానికి కారకులైన నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. నిందితులను ప్రశ్నిస్తున్నామని.. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వారణాసి సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ అమిత్ పాథక్ తెలిపారు.నిజానికి ఓఎల్ఎక్స్ పై ఈ తరహా ఫిర్యాదులు చాలా ఉన్నాయి.ఓఎల్ఎక్స్ ప్రకటనలను ఆధారంగా చేసుకుని సైబర్ కేటుగాళ్లు ఎంతోమందిని మోసగించడం కూడా జరిగింది.
మన తెలుగు రాష్ట్రాల్లోనే ఈ తరహా మోసాలు అనేకం జరిగాయి. ఓఎల్ఎక్స్ మోసాలపై తెలంగాణ పోలీస్ సైబర్ సెల్ ఒక డాక్యుమెంటరీని కూడా విడుదల చేయడం జరిగింది . అందుకే ఓఎల్ఎక్స్ ని నిషేధించాలంటూ తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి నివేదిక ఇచ్చినప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు.సరే ఇప్పుడు ప్రధానమంత్రి కార్యాలయాన్ని ఓఎల్ఎక్స్లో అమ్మకానికి పెట్టడం అనేది అతి తీవ్రమైన విషయం . ఇప్పటికైనా కేంద్రం తగిన చర్యలు తీసుకుంటుందేమో చూడాలి.