YSRCP : మృతదేహం వద్దకు వెళ్లి, ఆ మృతదేహం తాలూకా పింఛను గ్రామ వాలంటీర్ ఇవ్వడం సోమవారం అంతా సోషల్ మీడియాలో వైరల్ అయింది. విజయనగరం జిల్లా గుర్ల మండలం లోని గుర్ల గ్రామంలో ఎర్ర నారాయణమ్మ అనే వృద్ధురాలు సోమవారం ఉదయం మరణించింది. ప్రతి నెల ఒకటవ తేదీన రాష్ట్ర ప్రభుత్వం వాలంటీర్ల ద్వారా నేరుగా ఇంటి వద్దకే వృద్ధులకు పింఛన్ అందజేస్తోంది. సోమవారం ఒకటో తేదీ కావడంతో ఆ గ్రామ వాలంటీర్ గా పని చేస్తున్నా త్రినాద్ పింఛన్లు పంపిణీ చేసేందుకు నారాయణమ్మ ఇంటికి వెళ్లారు. అప్పటికే ఆమె మృతి చెందగా మృతదేహాన్ని బయట ఉంచి కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన త్రినాథ్ పింఛన్ అప్పటికే మంజూరు అయింది కాబట్టి దానిని ఇవ్వడం తన విధి అంటూ మృతదేహం తోనే వేలిముద్ర వేయించి కుటుంబ సభ్యులకు అందజేయడం ఇప్పుడు పెద్ద వివాదం అవుతోంది. చనిపోయిన వృద్ధురాలికి పింఛన్ ఇస్తున్నట్లు వేలిముద్రలు తీసుకుని సోషల్ మీడియాలో పెట్టడం పెద్ద కలకలం రేపుతుంది.
అసలు ఇవ్వొచ్చా.. నిబంధనలు ఒప్పుకుంటాయా??
చనిపోయిన వారికి పెన్షన్ ఇతర పథకాలు ఇవ్వడానికి నిబంధనలు అంగీకరించవు. చనిపోయిన వ్యక్తికి పెన్షన్ పంపిణీ చేశారని విషయం తెలుసుకున్న విజయనగరం అధికారులు దీని మీద విచారణ చేపట్టారు. చనిపోయిన వ్యక్తికి పింఛన్ మంజూరు చేయడం తప్పు. అసలు మృతదేహం నుంచి ఎలాంటి వేలిముద్రలు సేకరించ కూడదు. దీనిపై వాలంటీర్ వివరణ కోరతామని అధికారులు చెబుతున్నారు. వాలంటీరు అత్యుత్సాహం తోనే ఇలా చేసినట్లుగా కూడా తెలుస్తోంది. పింఛన్ మంజూరు చేయడంతో పాటు మృతదేహం వేలిముద్రలు తీసుకుంటూ వాటిని ఫోటోలు తీసుకొని సోషల్ మీడియాలో పెట్టడం చూస్తే, చట్టాలపై కనీస అవగాహన లేకపోవడమే అసలు సమస్య అని అర్థమవుతోంది.
అధికారుల ది మరీ ఓవరాక్షన్
ఈ ఘటనపై విచారణ చేసిన గుర్ల ఎంపీడీవో కొత్త వాదనను కొనసాగించి వివాదాన్ని సాగదీయడానికి ప్రయత్నిస్తున్నారు. నారాయణమ్మ వాళ్ళింటికి వెళ్లే సమయానికి చనిపోలేదని చివరి క్షణం లో ఉండగా కుటుంబ సభ్యులు ఇంటి బయటకు తెచ్చారని ఆయన చెబుతున్నారు. చనిపోక ముందే ఆమెకు పసుపు కుంకుమ పెట్టి అగరవత్తులు వెలిగించి అని ఆయన చెప్పడం చూస్తే నిజంగా హాస్యాస్పదంగా అనిపిస్తోంది. ఈ వివాదానికి ఇంతటితో ఫుల్స్టాప్ పెట్టాల్సిందే అధికారులు దానిని కొనసాగించేలా, వాలంటీర్లను కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేయడం విశేషం. చిత్రంలో మృతదేహం స్పష్టంగా కనిపిస్తున్న అధికారులు మాత్రం దానిని కప్పిపుచ్చే స్థాయిలో ప్రకటనలు చేయడం వల్ల మరింత ప్రమాదకరం.