టిడిపిలో చినబాబు లోకేశ్ ఒక్కసారిగా యాక్టివ్ కావడం వెనుక ఆ పార్టీకి ఆది నుండి అండగా నిలుస్తున్న ఒక పత్రికాధిపతి పాత్ర ఉందని సర్వత్రా వినవస్తోంది.
తాను నామకరణం చేసిన అమరావతి రాజధానిని జగన్ ప్రభుత్వం తరలించే ప్రయత్నాలపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఆ పత్రికాధిపతి వైసిపి సర్కారుపై విషం చిమ్మేందుకు ,అదే సమయంలో తనకు అత్యంత ఇష్టమైన టిడిపిని పునరుజ్జీవింపజేసేందుకు తెరవెనుక చక్రం తిప్పుతున్నారట. ఇందులో భాగంగా ఆయన తనదైన శైలిలో చంద్రబాబునాయుడుని డ్రైవ్ చేస్తున్నారని సమాచారం.ఇందులో భాగంగానే చంద్రబాబును ఇంటిపట్టున ఉండమని లోకేష్ ను బరిలోకి దింపమని ఆయన సలహా ఇచ్చారట. లోకేశ్ పుంజుకోవాలంటే ఇదే సరైన సమయమని ఆయన జనాల్లోకి వెళ్లే తరుణం ఆసన్నమైందని ఆ పత్రికాధిపతి చంద్రబాబుకు నూరిపోసారట.ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడూ లోకేష్కు అవకాశం రాదని ఆయన చంద్రబాబు చెవిలో కోరారట. నిజానికి కరోనా వచ్చినప్పటినుండి హైద్రాబాద్ కే టిడిపి అధినేత చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు లోకేష్ బాబులు పరిమితమయ్యారు.
చంద్రబాబు తన ఇంటి నుండే జూమ్ కాన్ఫరెన్స్ లతో పార్టీ ని నడిపిస్తున్నారు.ఆఖరికి పార్టీకి సంబంధించిన అన్ని కమిటీలను కూడా ఆయన ఇంటి నుండే ఖరారు చేశారు.చివరికి హైదరాబాదులో తన ఇంటికి వచ్చిన సన్నిహితులను కూడా చంద్రబాబు కలవడం లేదట.వయసు రీత్యా ఆయన జాగ్రత్తలో ఆయన ఉన్నారనుకోవాలి.అదే సమయంలో తనతో పాటే ఉన్న లోకేషును మాత్రం చంద్రబాబు ఏపీకి పంపేశారు.ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా వరద తాకిడికి గురైన అనేక జిల్లాల్లో లోకేష్ సుడిగాలి పర్యటన చేశారు.గతంలో మాదిరి పొరపాట్లు దొర్లకుండా జాగ్రత్తగానే మాట్లాడారు.మొత్తం మీద లోకేషు వ్యవహార శైలిలో బాగా మార్పు వచ్చిందని పార్టీవారు ,ప్రజలే కాకుండా అధికార పక్షమైన వైసిపి వారు కూడా అంగీకరించక తప్పని పరిస్థితి ఏర్పడింది.
సాధారణంగా లోకేష్ను వైసిపి వారు చిన్నచూపు చూస్తారు .పప్పు అంటుంటారు.కానీ ఇటీవల కాలంలో లోకేష్ను వైసిపి వారు కూడా టార్గెట్ చేస్తున్నారంటే ఆయన కొద్దిగా ఎదిగారనే భావించక తప్పదు. మరోవైపు జిల్లాల్లో టిడిపి పరిస్థితి ఏమిటి, నాయకులు ఏం చేస్తున్నారన్న విషయం కూడా తన మీడియా ద్వారా ఆపత్రికాధిపతి నివేదికలు తయారు చేయిస్తున్నారట.ఇంకా చెప్పాలంటే సత్తువ కోల్పోయిన తెలుగుదేశం పార్టీకి జవసత్వాలు నింపే పనిలో ఆ పత్రికాధిపతి మునిగితేలుతున్నారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.వైసీపీ దూకుడుకు బెదిరిపోయిన చంద్రబాబు కూడా చేతులెత్తేసి ఆయన చెప్పినట్టే నడుచుకుంటున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి.