ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై కీలక ప్రచారం జరుగుతోంది. రైతన్నలకు ఎంతో అండగా ఉన్న ఉచిత విద్యుత్ పథకాన్ని ఎత్తేవేసే ప్రయత్నం వైఎస్ జగన్ ప్రభుత్వం చేస్తుందంటూ టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.
ఏపీ సర్కారును ఓ రేంజ్లో టార్గెట్ చేస్తున్నారు. అన్నదాతల్లో బయం రేకెత్తించే ప్రయత్నం జరుగుతోంది.
అసలేంది ఈ రచ్చ?
రాష్ట్రాలు అప్పులు తెచ్చుకునే పరిమితిని 3.5 నుంచి 5శాతానికి పెంచుకోవాలంటే కొన్ని సంస్కరణలు చేయాలని.. వాటిలో భాగంగా ఉచిత విద్యుత్ పథకాలకు డైరెక్ట్గా లబ్ధిదారులకు నగదు బదిలీని అమలు చేయాలని.. అలా అయితేనే అప్పులు, నిధులిచ్చే కార్యక్రమాన్ని పరిశీలిస్తామని డ్రాఫ్ట్ బిల్లును కేంద్రం తీసుకువచ్చింది. దీనిపై దుమారం రేగింది. తెలంగాణతో పాటు మిగతా రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం మాత్రం ఈ పథకాన్ని అమల్లోకి తీసుకొస్తూ జీవో కూడా ఇచ్చేసింది. ఉచిత విద్యుత్ పొందుతున్న రైతులకు నగదు బదిలీ ఇస్తామని చెప్పింది. అంటే రైతులు ముందు కట్టాలి. లేదా రైతుల పేరిట ప్రభుత్వమే అకౌంట్లు ఓపెన్ చేసి, వారి అకౌంట్లో డబ్బులు వేస్తే ఆ డబ్బులు వయాగా మళ్లీ డిస్కంలకు వెళతాయి. ఇది ప్రభుత్వం చెబుతున్న మాట. ఈ నేపథ్యంలో ఉచిత విద్యుత్కు మంగళం పాడుతున్నారనే ప్రచారం మొదలైంది.
ప్రభుత్వం మాట ఏంటి?
ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఉచిత విద్యుత్పై మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతులకు ఉచిత విద్యుత్ అందించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేసిన ఆయన.. అన్నదాతలను రెచ్చగొట్టొందని ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో రైతులు విద్యుత్ బిల్లులు చెల్లించాల్సి వస్తే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకే వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నామని మంత్రి తెలిపారు. వచ్చే 30 ఏళ్ల పాటు రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తామని ప్రకటించారు మంత్రి బాలినేని తేల్చిచెప్పారు. రైతులు విద్యుత్ బిల్లుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరంలేదని క్లారిటీ ఇచ్చారు. గతంలో విద్యుత్ ఛార్జీలు పెంచారని ఆందోళనలు చేస్తే కొంతమంది ప్రాణాలు కోల్పోయారని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్రంలో చేసిన పరిపాలనను గుర్తు చేశారు.
జగన్ నమ్మినబంటు ఏమంటున్నారు?
ఏపీ ముఖ్యమంత్రి నమ్మినబంటు అనే పేరున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఈ వివాదంపై స్పందించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉచిత విద్యుత్ పథకాన్ని ఎత్తేవేసే ప్రయత్నం చేస్తుందంటూ టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారని, ఇదంతా ఉద్దేశ పూర్వకమేనని ఆరోపించారు. టీడీపీ కావాలనే రాజకీయం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసిన సజ్జల రామకృష్ణారెడ్డి ఉచిత విద్యుత్ పథకం అమలుకు రైతుల ఖాతాల్లో నగదు బదిలీ అవుతుందని ప్రకటించారు. సంక్షేమ పథకాలు అన్నింటినీ నగదు బదిలీ కింద మార్చాలనే చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తోందని, చట్టం వచ్చిన తర్వాత అమలుకు హడావిడి పడకుండా ఏపీ ప్రభుత్వం ఇప్పటి నుంచే కసరత్తు మొదలుపెట్టిందని చెప్పారు. ఇది ఉచిత విద్యుత్ను ఎత్తివేయడం కాదని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.