కరోనా వైరస్ (కోవిడ్-19) అన్ని దేశాల్లోనూ తన ప్రభావం పెంచుకుంటూనే ఉంది. ఇప్పటికే వైరస్ మహమ్మారి సృష్టించిన ఆర్థిక, ఆరోగ్య సంక్షోభంతో యావత్ ప్రపంచం కొట్టుమిట్టాడుతున్న సంగతి తెలిసిందే. అయితే, వైరస్ వ్యాప్తి ఇంతలా వ్యాపించడంలో ప్రధాన కారణం.. దాని బారినపడ్డామనే విషయం తెలియక.. చాలా మంది అందిరితోనూ తిరగడం మరింత వ్యాప్తికి కారణమవుతోంది. కోవిడ్-19ను గుర్తించడం కూడా కొంత సవాలుతో కూడుకున్న సంగతి అని తెలిసిందే.
అయితే, ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలను బలితీసుకున్న కరోనా మహమ్మారి నియంత్రణలో మనుషులతో పాటు జంతువులు కూడా పాలుపంచుకుంటున్నాయి. మరీ ముఖ్యంగా శునకాలు సైతం తమ వంతు పాత్ర పోషిస్తామంటూ.. కరోనాపై యుద్ధానికి సిద్ధమవుతున్నాయి. శునకాలు కరోనాపై పోరాటం చేయడం ఎంటి? అని ఆశ్చర్య పోకండి. మీరు చదివింది నిజమే. కరోనా వైరస్ను గుర్తించేందుకు చాలా దేశాల్లో సరైన కిట్లు అందుబాటులో లేవు. బహిరంగ ప్రాంతాల్లో పెద్ద సవాలే.
ఈ నేపథ్యంలోనే కోవిడ్-19ను గుర్తించడంలో మనుషులకు అండగా శునకాలు నిలుస్తున్నాయి. అదేలాగంటే.. శునకాలకు ఉన్న గొప్ప ఘ్రాణశక్తితో వైరస్ను పూర్తి స్థాయి ఖచ్చితత్వంతో గుర్తిస్తాయని వెల్లడించిన సైంటిస్టులు.. ఆ విధమైన ప్రయోగాలు చేస్తున్నారు. దీనిలో భాగంగా చాలా దేశాలు కరోనా మహమ్మారిని గుర్తించడానికి శునకాలకు ట్రైనింగ్ ఇస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రయోగాలు చేస్తున్న సైంటిస్టుల బృందం ఈ నెల 3న “ఇంటర్నేషనల్ కె9 బృదం” పేరుతో ఓ ఆన్లైన్ వర్క్షాపును నిర్వహించారు. దీంట్లో వారి వారి పరిశోధనకు సంబంధించిన వివరాలను పంచుకున్నారు.
దీని గురించి హోల్గర్ వోల్క్ అనే ఓ వెటర్నరీ న్యూరాలజిస్ట్ మాట్లాడుతూ.. కరోనా వైరస్ను గుర్తించడంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న కిట్లతో పాటు శునకాలకు సైతం వైరస్ ను గుర్తించే శక్తి ఉందని తాము విశ్వసిస్తున్నామని తెలిపారు. కరోనా కట్టడి కోసం శునకాలను ఉపయోగించే ప్రాజెక్టులో భాగంగా స్నిఫ్పర్ డాగ్స్ కు ట్రైనింగ్ ఇస్తున్నామన్నారు. ఇప్పటికే అమెరికా, ఫిన్లాండ్, లెబనన్ దేశాల్లో దీనికి సంబంధించిన బహిరంగ ట్రయల్స్ సైతం కొనసాగుతున్నాయి. ముఖ్యంగా కరోనా రోగుల చెమట, వారి శరీరం నుంచి వచ్చే వాసన, వారి అడుగుల ద్వారా వైరస్ను గుర్తించే విధంగా సైంటిస్టులు శునకాలకు ట్రైనింగ్ ఇచ్చారు. ఆయా దేశాల్లో ఈ శునకాలు స్కాన్ చేసిన వారిలో 92 శాతం కేసులను గుర్తించాయట. వీరిలో వైరస్ లక్షణాలు కనబడకముందే గుర్తించడం మరో విశేషం.