Doordarshan: భారత ప్రభుత్వ నిర్వహణలోని దూరదర్శన్ ఛానెల్ తన లోగో రంగును కాషాయ రంగులోకి మార్చడం తీవ్ర దుమారాన్ని రేపుతోంది. రంగు మార్పుపై ప్రతిపక్ష పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి.
గతంలో డీడీ న్యూస్ లోగో ఎరుపు రంగులో ఉండగా..ఇటీవల దాన్ని కాషాయ (ఆరెంజ్) రంగులోకి మార్చారు. ఈ విషయాన్ని సంస్థ అధికారికంగా వెల్లడించింది. మా విలువలు అలాగే ఉన్నాయి. కానీ ఇక నుండి మేం కొత్త అవతార్ లో అందుబాటులో ఉంటాం. కొత్త ప్రయాణానికి సిద్దం కండి అని సోషల్ మీడియాలో రాసుకొచ్చింది.
అయితే ఈ లోగో ను బీజేపీ జెండా రంగు అయిన కాషాయంలోకి మార్చడంపై విపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం చేస్తున్నాయి. స్వయం ప్రతిపత్తి ఉన్న ప్రభుత్వ సంస్థలపై నియంత్రణ సాధించేందుకు బీజేపీ చేస్తున్న కుట్ర ఇది. జాతీయ ప్రచార సంస్థ విశ్వసనీయతను దెబ్బతీసే ప్రయత్నమే అని కాంగ్రెస్ నేతలు దుయ్యబట్టారు.
మరో వైపు డీడీ న్యూస్ మాజీ సీఈవో, టీఎంసీ ఎంపీ జవహర్ సిర్కార్ దీన్ని తప్పుబట్టారు. డీడీ లోగో కాషాయం రంగులోకి మారడం బాధ కలిగించిందని అన్నారు. దూరదర్శన్ కాస్త.. ప్రసార భారతి నుండి ప్రచార భారతిగా మారిందని ఎద్దేవా చేశారు. సిర్కార్ 2012 నుండి 2016 వరకూ డీడీ, ఆల్ ఇండియా రేడియో సీఈవోగా బాధ్యతలు నిర్వహించారు. బీజేపీ తమ ప్రచారం కోసం ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఛానల్ లోగో రంగు మార్చిందన్నారు. ఈ పద్ధతి సరికాదని అన్నారు. ఈసీ జారీ చేసే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ను ఉల్లంఘించడమేనని ఆయన ఆరోపించారు.
దీనిపై డీడీ న్యూస్ సీఈవో గౌరవ్ ద్వివేది స్పందించారు. చూపరులకు అందంగా కనిపించడానికి ఆకర్షనీయంగా ఉండే కాషాయ రంగును లోగోలో వాడామని తెలిపారు. కేవలం లోగో మాత్రమే కాకుండా, కొత్త లైటింగ్, పరికరాలతో సహా ఛానల్ రూపు రేఖల్ని మార్చేశామన్నారు. దీనిపై విమర్శలు చేయడం దురదృష్టకరమని అన్నారు.
1959 సెప్టెంబర్ 16న తొలి సారి దురదర్శన్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఆ తర్వాత దీన్ని కేంద్ర సమాచార శాఖ కిందకు తీసుకురాగా, జాతీయ బ్రాడ్ కాస్టర్ గా మారింది. అనంతరం డీడీ నెట్ వర్క్ కింద అనేక ఛానళ్లను తీసుకొచ్చారు. ప్రస్తుతం దురదర్శన్ లో ఆరు జాతీయ, 17 ప్రాంతీయ ఛానల్స్ అందుబాటులో ఉన్నాయి. గతంలో పలు మార్లు దీని లోగో రంగులను మార్చారు. నీలం, పసుపు, ఎరుపు ఇలా పలు రంగుల్లో కన్పించినప్పటికీ.. గ్లోబ్ చుట్టూ రెండు రేకుల డిజైన్ మాత్రం మారలేదు.
Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు