Lok sabha Election: ఎన్నికల కోడ్ అమలు అవుతున్న సమయంలో రాజకీయ పార్టీల నేతలు ఏర్పాటు చేసే సమావేశాలకు ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనకూడదు. దూరంగా ఉండాలి. ఒక వేళ ప్రభుత్వ ఉద్యోగులు పార్టీ నేతలు ఏర్పాటు చేసిన సమావేశాల్లో పాల్గొంటే అది కోడ్ ఉల్లంఘనకు పాల్పడినట్లుగా గుర్తిస్తారు. తాజాగా ఓ రాజకీయ పార్టీ నేత, అభ్యర్ధి ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న వంద మందికిపైగా ఉద్యోగులు సస్పెండ్ అయ్యారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లాలో జరిగింది.
విషయంలోకి వెళితే..మెదక్ లోక్ సభ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్ధి వెంకట్రామిరెడ్డి ఇటీవల సిద్దిపేటలోని రెడ్డి సంక్షేమ భవన్ లో ఉపాధి హమీ, సెర్ప్ ఉద్యోగులతో సమావేశమైయ్యారు. గతంలో సిద్దిపేట కలెక్టర్ గా పని చేసిన అనుభవం, పరిచయాలతో లోక్ సభ సీటు గెలుచుకోవడానికి బీఆర్ఎస్ అభ్యర్ధి వెంకట్రామిరెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ నేతలు, పలవురు ఉద్యోగులతో సమావేశం నిర్వహించారు. దీనిపై మెదక్ లోక్ సభ బీజేపీ అభ్యర్ధి రఘునందనరావు కూడా ఈసీకి ఫిర్యాదు చేశారు.
ఈ క్రమంలో ఉద్యోగులపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. సీసీ టీవీ పుటేజీ అధారంగా సమావేశంలో పాల్గొన్న ఉద్యోగులను గుర్తించారు. 38 మంది సెర్ప్ ఉద్యోగులు, 68 మంది ఉపాధి హామీ ఉద్యోగులను సిద్దిపేట కలెక్టర్ మను చౌదరి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. మొత్తం 106 మంది ఉద్యోగులను ఒక్క ఉత్తర్వుతో సస్పెండ్ చేయడం తీవ్ర సంచలనం అయ్యింది.
ఈ సమావేశం అత్యంత రహస్యంగా నిర్వహించినప్పటికీ రాత్రి 11 గంటల సమయంలో విషయం లీకైంది. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఫంక్షన్ హాలు వద్దకు చేరుకోగా, అక్కడి సిబ్బంది వారిని లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో వారు పోలీసులకు ఫోన్ చేశారు. పోలీసులు వచ్చే సమయానికి వెంకట్రామిరెడ్డి, ఉద్యోగులు అక్కడి నుండి వెళ్లిపోయారు. అయితే ఈ ఘటనపై కలెక్టర్ కు ఫిర్యాదు చేయడంతో అక్కడి సీసీ టీవీ పుటేజీని పరిశీలించి చర్యలు తీసుకున్నారు. దీంతో ఉద్యోగ వర్గాల్లో కలవరం మొదలైంది.