పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం ఏలూరు పట్టణ ప్రజలను ఓ అంతు పట్టని వ్యాధి ఆందోళనకు గురి చేస్తున్న విషయం తెలిసిందే. దాదాపు 200 మందికి పైగా మూర్ఛ వ్యాధి లక్షణాలతో ఆసుపత్రుల్లో చేరి చికిత్స పొందుతున్నారు. ఈ వ్యాధి ఏమిటి? ఎలా వచ్చింది? కారణాలు ఏమిటి? అనే విషయాలు ఇంకా వెల్లడి కాలేదు. ఈ నేపథ్యంలోనే మూర్ఛ వ్యాధి లక్షణాలతో ఆసుపత్రిలో ఈ ఉదయం చేరిన ఓ వ్యక్తి రాత్రి 7గంటల ప్రాంతంలో మృతి చెందాడు. స్థానిక విద్యానగర్ ప్రాంతానికి చెందిన శ్రీధర్ (45) అనే వ్యక్తి మూర్ఛ వ్యాధి లక్షణాలతో అస్వస్థతకు గురి కాగా కుటుంబ సభ్యులు ఉదయం 7గంటల ప్రాంతంలో ఆసుపత్రికి తీసుకుని వెళ్లి జాయిన్ చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అతను రాత్రి 7గంటల ప్రాంతంలో మృతి చెందారు. అయితే అంతు పట్టని ఈ వ్యాధిపై పరిశోధన కైనా మృత దేహానికి పోస్ట్ మార్టం నిర్వహించాల్సి ఉన్నా అటువంటిది ఏమి పట్టించుకోకుండా వైద్యులు అతని మృత దేహాన్ని బంధువులకు అప్పగించారు.
తీరా బంధువులు మృత దేహాన్ని అంబులెన్సులో ఇంటికి తీసుకుని వెళ్లిన తరువాత పోలీసులు రంగ ప్రవేశం చేశారు. శ్రీధర్ మృత దేహానికి పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రి కి తరలించాలంటూ పెద్ద సంఖ్యలో పోలీసులు అతని ఇంటి వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంలో పోలీస్ లకు, మృతుని కుటుంబ సభ్యులకు మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకున్నది. ప్రభుత్వ ఆసుపత్రి నుండి ఇంటికి మృత దేహం తీసుకుని వచ్చిన తరువాత తిరిగి తీసుకుని వెళ్లడం ఎంతవరకు సమంజసమని మృతుని కుటుంబ సభ్యులు పోలీస్ లను నిలదీశారు. పోలీస్, రెవిన్యూ అధికారులు వారి కుటుంబ సభ్యులను ఒప్పించి మృత దేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
అయితే ఈ విషయంలో వైద్య ఆరోగ్య శాఖ, రెవిన్యూ, పోలీస్ శాఖల మధ్య సమన్వయలోపం స్పష్టం అవుతోంది. అంతు చిక్కని వ్యాధితో ఓ వ్యక్తి ఆసుపత్రిలో మృతి చెందినప్పుడు వైద్యాధికారులు ముందుగా రెవిన్యూ, పోలీస్ వర్గాలకు సమాచారం అందించి వారి దర్యాప్తు, పంచినామా అనంతరం మృత దేహాన్ని బంధువులకు అప్పగించాల్సి ఉంటుంది. ఈ విషయంలో అధికారుల బాధ్యతరాహిత్యం పై ఉన్నతాధికారులు ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.