న్యూ ఢిల్లీ, ఫిబ్రవరి15: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం దేశంలోనే అత్యంత వేగంగా ప్రయాణించే రైలు వందే భారత్ ఎక్స్ప్రెస్ను ప్రారంభించారు. పుల్వామా టెరరిస్టు దాడిని దృష్టిలో ఉంచుకుని పెద్దగా హడావుడి లేకుండా దేశ రాజధానిలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రధాని ఈ రైలుకు పచ్చ జెండా ఊపారు. రైల్వే మంత్రి పీయూష్ గోయల్, రైల్వే బోర్డు సభ్యులు కూడా ఈ రైలు మొదటి ప్రయాణంలో పాలు పంచుకుంటున్నారు.
వందే భారత్ రైలు గురించి 8 ముఖ్యమైన పాయింట్లు:
- వందే భారత్ రైలు గంటకు 160 కిలోమీటర్ల వేగం వరకూ వెళ్లగలదు.
- ఈ రైలు ఢిల్లీ – వారణాసి మధ్య ప్రయాణిస్తుంది. మధ్యలో కాన్పూర్లో, అలహాబాద్లో 40 నిముషాల చొప్పున ఆగుతుంది. ఆ సమయంతో కలిపే గమ్యస్థానాన్ని 9 గంటల 45 నిముషాల వ్యవధిలో అధిగమిస్తుంది.
- రైలు సీటింగ్ సామర్ధ్యం 1,128 సీట్లు. మొత్తం 16 ఎసి బోగీలలో రెండు ఎగ్జిక్యూటివ్ క్లాస్ బోగీలు.
- ఈ రైలు టికెట్లు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. ఛైర్కార్ టికెట్ ధర 1,760 రూపాయలు. ఎగ్జిక్యూటివ్ క్లాస్ టికెట్ ధర 3,310 రూపాయలు.
- అన్ని బోగీలకూ ఆటోమాటిక్ తలుపులు బిగించారు. బోగీలలో జిపిఎస్ ద్వారా పని చేసే ఆడియో – విజువల్ వ్యవస్థ ఉంటుంది. ఇది ప్రయాణీకులకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తుంది. వినోదం కోసం బోగీలలో హాట్స్పాట్ వైపై సౌకర్యం కూడా కల్పించారు.
- ఇంతకు ముందు దీనిని ట్రెయిన్ 18 అన్నారు. ఇప్పుడు దీని పేరు వందే భారత్గా మార్చారు.
- రైలులో పాంట్రీ సదుపాయం ఉంది. ప్రయాణీకులకు వేడివేడి కాఫీ, టీ, భోజనం, చల్లటి పానీయాలూ దొరుకుతాయి.
- వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు బోగీలను చెన్నైలోని ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో తయారుచేశారు.