ఢిల్లీ: ఎన్నికల నిర్వహణలో విఫలమైందని ఆరోపణలు ఎదురుకొంటున్న ఎన్నికల సంఘానికి అనుకోని అతిధి ఫోన్ చేశారు.
ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న తీరు, ఎన్నికల అధికారుల మెతక వైఖరిపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయనే మాజీ ఎన్నికల అధికారి టిఎన్ శేషన్.
పోలింగ్కు ముందు ఐటి దాడులు, అలాగే నేతల ప్రసంగాల్లో కుల, మతాలను ప్రస్తావిస్తున్నా చర్యలు తీసుకోవటంలో ఎన్నికల సంఘం విఫలమైందని విమర్శలు వస్తున్న నేపథ్యంలో శేషన్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునీల్ అరోరాకు ఫోన్ చేసినట్లు తెలుస్తోంది.
ఎన్నికల సంఘానికి ఉన్న విశేష అధికారాలను భారత దేశ ప్రజానికానికి, వివిధ రాజకీయ పక్షాల నాయకులకు తెలియజెప్పిన అధికారిగా శేషన్కు పేరుంది. శేషన్ ఎన్నికల కమిషనర్గా నియమితులు అయ్యే వరకు ఎన్నికల సంఘానికి ఇన్ని విశిష్ట అధికారాలు ఉంటాయన్నది ఇటు ప్రజలకు, అటు అధికారులకు తెలియదు. అందుకే ఎన్నికలు జరిగే విధానం శేషన్ రాకముందు, వచ్చిన తర్వాత అనే విధంగా సమూల మార్పులు తీసుకువచ్చారాయన.
1955 ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ బ్యాచ్కి చెందిన తిరువెళ్లై నారాయణ అయ్యర్ శేషన్ (టిఎన్ శేషన్) 1990 డిసెంబరు 12న 10వ చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టారు. 1996 డిసెంబరు 11వ తేదీ వరకు ఎన్నికల కమిషనర్గా పనిచేసిన శేషన్ ఎన్నికల విధానంలో తీసుకువచ్చిన సంస్కరణలు నేటికీ అమలవుతూనే ఉన్నాయి.
ఆయన ప్రవేశపెట్టిన సంస్కరణలతో రాజకీయ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. అందుకే ఆయన్ని ఎలక్షన్ వాచ్ డాగ్గా పిలుస్తారు.