అమరావతి: జులైలో పోలవరం నుంచి నీటి విడుదలకు సిద్ధంగా ఉండాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. కుడి, ఎడమ ప్రధాన కాల్వ పనులు పూర్తి చేయాలని సూచించారు. చంద్రబాబు బుధవారం పోలవరం పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా అధికారులు ప్రాజెక్ట్ పురోగతిని చంద్రబాబుకు వివరించారు. ఇప్పటి వరకు ప్రాజెక్టు నిర్మాణం 69 శాతం, కాంక్రీట్ పనులు 72.40 శాతంతో 28.16 లక్షల క్యూబిక్ మీటర్ల పనులు పూర్తయ్యాయని అధికారులు తెలిపారు. తవ్వకం పనులు 84.60 శాతం పూర్తయ్యాయని, కుడి ప్రధాన కాల్వ పనులు 90.87 శాతం, ఎడమ ప్రధాన కాల్వ పనులు 70.38 శాతం పూర్తయ్యాయయని తెలిపారు. రేడియల్ గేట్ల ఫ్యాబ్రికేషన్ పనులు 66.22 శాతం, ఎగువ కాఫర్ డ్యామ్ పనులు 40.71 శాతం, దిగువ కాఫర్ డ్యామ్ పనులు 25.04 శాతం పూర్తయినట్టు అధికారులు చంద్రబాబుకు వివరించారు.
ఎన్నికల అనంతరం పోలవరం పనులపై సమీక్షించడం ఇదే తొలిసారి. మొత్తంగా ఇప్పటి వరకూ 90 సార్లు చంద్రబాబు పోలవరం పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఇదిలా ఉంటే చంద్రబాబు సమీక్ష నిర్వహించడంపై వైసిపి విమర్శలు చేసింది. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఎలా సమీక్ష నిర్వహిస్తారని వైసిపి నేత అంబటి రాంబాబు ప్రశ్నించారు. రావాల్సిన కమీషన్ల కోసమే సమీక్షలు నిర్వహించారని ఆయన ఆరోపించారు.