తిరుపతి లోక్సభ ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీ అందరికన్నా ముందే తన అభ్యర్థిని ప్రకటించడం వెనుక ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఎత్తుగడ ఏమిటన్నది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
సిట్టింగ్ వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాదరావు ఆకస్మిక మరణం కారణంగా ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే.ఇప్పటికీ ఇంకా ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే చంద్రబాబునాయుడు తమ పార్టీ అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పేరును ప్రకటించేశారు.ఇదే పనబాక లక్ష్మి మొన్నటి లోక్సభ ఎన్నికల్లో కూడా పోటీ చేసి బల్లి దుర్గాప్రసాద్ చేతిలో ఓటమి పాలయ్యారు.వారిద్దరి మధ్య ఓట్ల తేడా రెండున్నర లక్షల వరకు ఉంది.నిజానికి పనబాక లక్ష్మి తిరుపతికి నాన్ లోకల్.ఆమెది నెల్లూరు జిల్లా.గతంలో నెల్లూరు నుంచి బాపట్ల నుండి ఆమె లోక్సభకు ఎన్నికయ్యారు.మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు.
రాష్ట్ర విభజన నేపధ్యంలో ఆమె కాంగ్రెస్ పార్టీకి గుడ్బై చెప్పి ఆఖరి నిమిషంలో టిడిపిలో చేరారు.దీంతో చంద్రబాబు ఆమెను తిరుపతి లోక్సభ టిడిపి అభ్యర్థిగా నిలబెట్టారు.ఓటమి చెందిన అనంతరం పనబాక లక్ష్మి మళ్లీ తిరుపతి ముఖం చూసిన దాఖలాలు లేవంటారు.ఆ మాటకొస్తే ఆమె రాజకీయాల్లోనే చురుగ్గా లేరు టీడీపీలో క్రియాశీలక పాత్ర పోషించడం లేదు.అంతేగాక మొన్నటి టిడిపి పదవుల పందారంలో తనకు ఛాన్స్ రాలేదని ఆమె బాధపడి కూడా పొయ్యారట.ఒక దశలో ఆమె బీజేపీ వైపు కూడా పక్క చూపులు చూశారంటారు.అయితే అకస్మాత్తుగా పనబాక లక్ష్మి అభ్యర్థిత్వాన్ని చంద్రబాబు ఖరారు చేశారు.ఆయన ఎందుకు ఇందుకు తొందరపడ్డారన్న దానికి విశ్లేషణాత్మక కథనాలు వినిపిస్తున్నాయి.ఇందులో మొదటగా చెప్పేదేమిటంటే టిడిపికి ప్రస్తుతమున్న పరిస్థితుల్లో తిరుపతి లోక్సభ నియోజకవర్గంలో పనబాక లక్ష్మి కంటే మంచి అభ్యర్థి దొరికే అవకాశం లేదట.
గతంలో కూడా టిడిపికి తిరుపతిలో సరైన అభ్యర్థి లేకపోవడంతో కృష్ణాజిల్లాకు చెందిన వర్ల రామయ్యను తిరుపతి నుండి పోటీ చేయించడం తెలిసిందే.అంతేగాకుండా నిద్రావస్థలో ఉన్న తెలుగుదేశం పార్టీ క్యాడర్ ను మేల్కొల్పడానికి చంద్రబాబు తిరుపతి ఉప ఎన్నికను ఉపయోగించుకుంటున్నారట.ముందే అభ్యర్థిని ప్రకటించటం ద్వారా ప్రజల్లోకి వెళ్లి వైసిపి ప్రభుత్వ వైఫల్యాలను చాటిచెప్పే వేదికను కూడా ఆయన సిద్ధం చేసుకున్నారని సమాచారం.వైసిపి అధికారంలోకి వచ్చాక జరుగుతున్న తొలి ఉప ఎన్నిక కాబట్టి ప్రధాన ప్రతిపక్షంగా టీడీపీ తన సత్తా చాటుకోవాలని తాపత్రయ పడుతోంది.అదేమీ తప్పు కానప్పటికీ గెలుపుపై ధీమాతో ఇంతగా టిడిపి కష్టపడుతోంది అనుకోవడం అవివేకం. తిరుపతిలో మళ్లీ ఓడిపోయినప్పటికీ గతంలో వైసీపీ అభ్యర్థికి వచ్చిన మెజారిటీ ని తగ్గించి చూపి రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం పట్ల ప్రజా వ్యతిరేకత మొదలైందని చాటుకోవడానికి చంద్రబాబు తహతహలాడుతున్నారు అన్నది అసలు వాస్తవం.ఈ క్రమంలో మళ్లీ పనబాక లక్ష్మి బలి కానున్నదని వ్యాఖ్యలు వినవస్తున్నాయి.