కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గ వైసీపీలో వర్గ విబేధాలు మళ్లీ భగ్గుమన్నాయి. నియోజకవర్గ వైసీపీలోని మూడు వర్గాల మధ్య విబేధాలు ఉన్న విషయం తెలిసిందే. ఇంతకు ముందు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, కెడీసీసీ చైర్మన్ యార్లగడ్డ వెంకట్రావు, సీనియర్ నేత దుట్టా రామచంద్రరావు వర్గీయుల మధ్య ఘర్షణలు జరిగిన విషయం తెలిసిందే. నెలాపదిహేను రోజుల క్రితం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి విజయవాడలో జరిగిన ఒక కార్యక్రమంలో వల్లభనేని వంశీ, యార్లగడ్డ వెంకట్రావుల చేతులు కలిపించి కలిసి పని చేసుకోవాలని సూచించిన విషయం తెలిసిందే. అంతకు ముందు ఈ నాయకులు పత్రికా ముఖంగా ఒకరిపై మరొకరు విమర్శలు కూడా చేసుకున్నారు. అయితే కొద్ది రోజులుగా ఎటువంటి ఘర్షణలు లేకుండా ప్రశాంతంగా ఉండగా నేడు విబేధాలు భగ్గుమన్నాయి.
గన్నవరం నియోజకవర్గ పరిధిలోని కేసరపల్లిలో వర్గ పోరు తారాస్థాయికి చేరింది. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సమక్షంలోనే రెండు వర్గాలు బాహాబాహీకి దిగారు. ఈ ఘర్షణలో పలువురు వైసీపీ నేతలకు గాయాలు అయ్యాయి. గాయపడిన ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.