గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) ప్రస్తుత పాలకవర్గ కాలపరిమితి కొద్ది నెలల్లో ముగియనున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో స్టాండింగ్ కమిటీ సభ్యులు ఖరీదైన ఐ ఫోన్లు కావాలని పట్టుబట్టడం, వాటి కోసం ప్రతిపాదనలు సిద్ధం చేసి బడ్జెట్లో ఏకంగా రూ. 27,23,740 ఆమోదించడం తీవ్ర విమర్శలకు కారణమవుతోంది.
స్టాండింగ్ కమిటీ సభ్యులు కోరిన ఫోన్ సాధారణమైన స్మార్ట్ ఫోన్ లు ఏమి కాదు. ఐ ఫోన్ 12 ప్రొ,512 జిబీ సామర్థ్యం ఉన్న పోన్ లు కావాలని కోరారు. ఒక్కొక్క ఫోన్ ఖరీదు లక్షన్నర పైమాటే. 15 మంది స్టాండింగ్ కమిటీ సభ్యులతో పాటు మేయర్, డిప్యూటి మేయర్ సహా మొత్తం 17 అపిల్ ఐఫోన్ లకు రూ.27,23,740 లు ఖర్చు చేసేందుకు స్టాండింగ్ కమిటీ ఎజెండాలో పెట్టి ఆమోదించుకున్నారు. అయితే ఈ విషయం బయటకు పొక్కడంతో అబ్బే అదేమి లేదు, ప్రస్తుతం మార్కెట్లో ఆ ఫోన్ లు అందుబాటులో లేనందున వాయిదా వేశారని ప్రచారం చేశారు.
రాబోయే ఆర్థిక సంవత్సరానికి (2021-22) సంబంధించి గత నెలలో 5600 కోట్ల రూపాయలతో ప్రవేశపెట్టిన ముసాయిదా బడ్జెట్ను జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎలాంటి మార్పులు చేర్పులు లేకుండా యథాతధంగా ఆమోదించింది. మేయర్ బొంతు రామ్మోహన్ అధ్యక్షతన గురువారం జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో ముసాయిదా బడ్జెట్ ను ఆమోదించారు. స్టాండింగ్ కమిటీ ఆమోదించిన ఎజండాలోని అంశాలు బయటకు రావడంతో అపిల్ ఐ ఫోన్ల కొనుగోళ్ల అంశంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి.
జనాల సొమ్మును ఎంత ఈజీగా తినేయోచ్చు, తినేస్తున్నారు, తినేస్తూనే ఉంటారు అదే దానికి ఇది చిన్న ఉదాహారణ అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.