ఎగువ ప్రాంతాల్లో కురుస్తొన్న భారీ వర్షాలకు గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తొంది. వరద ప్రవాహం గణనీయంగా ఉండటంతో భద్రాచలం, దవళేశ్వరం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరికలను అధికారులు జారీ చేశారు. భద్రాచలం వద్ద 52 అడుగుల నీటి మట్టం నమోదు అయ్యింది. నీటి మట్టం 53 అడుగులకు చేరుకుంటే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. ఈ ఏడాది వరుసగా మూడు నెలల్లో నాలుగు సార్లు గోదావరికి భారీగా వరద రావడంతో నదీ పరివాహాక ప్రాంతాల ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. భద్రాచలంలో ప్రస్తుతం గోదావరి స్నానఘాట్ లు చాలా వరకు నీట మునిగాయి. కళ్యాణకట్ట దిగువకు నీరు చేరింది.
వరద పెరుగుతున్నా కరకట్ట కు పెద్దగా లీకేజీ బెడద లేకపోవడంతో ఊరట కల్గిస్తొంది. అయితే భద్రతను దృష్టిలో పెట్టుకుని కరకట్టపై నుండి వాహనాల రాకపోకలను అధికారులు కట్టడి చేశారు. అశ్వాపురం, భూర్గంపాడు మండలాల్లో నదీ పరివాహాక ప్రాంతాల్లో పంట పొలాలు నీట మునిగాయి. మరో పక్క అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం కన్నాయిగూడెం – భద్రాద్రి జిల్లా దమ్మగూడెం మండలం తూరుబాక ప్రధాన రహదారిపై వరద నీరు చేరడంతో ప్రయాణీకులు ఇబ్బందులు పడుతున్నారు. ములుగు జిల్లాకు రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలం నుండి అల్లూరి జిల్లా కూనవరం మండలానికి వెళ్లే మార్గంలో పది ప్రదేశాల్లో వరద నీరుతో మూసుకుపోయింది. భద్రాచలం నుండి ఏపిలోని విలీన మండలాలకు, చత్తీస్ గడ్, ఒడిశా రాష్ట్రాలకు వెళ్లే మార్గాలు వరదతో పొటెత్తాయి.
ఇదే క్రమంలో దవళేశ్వరం వద్ద గోదావరి వరద ఉదృతి క్రమక్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం 13.70 అడుగులకు గోదావరి నీటి మట్టం చేరింది. 12.80.601 క్యూసెక్కుల వరద నీరు ఇన్ ఫ్లో వస్తుండగా అంతే మొత్తంలో సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. రహదారులపై వరద నీరు పొంగి ప్రవహిస్తొంది. వరద ప్రవహం పెరగడంతో కోససీమ లోని లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గ్రామాల ప్రజలు నాటుపడవల పైనే ప్రయాణం సాగిస్తున్నారు. గోదావరి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు వరద ప్రభావిత ప్రాంత ప్రజలను ఇప్పటికే అప్రమత్తం చేశారు. మరో పక్క కృష్ణానదికి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది.