తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అసెంబ్లీ సమావేశాల సాక్షిగా మరిన్ని వ్యాఖ్యలు తెరమీదకు వచ్చాయి.
హైదరాబాద్ అభివృద్ధిపై అసెంబ్లీలో అధికార, ప్రతిపక్షాల వాగ్వాదం జరిగింది. డబుల్ బెడ్ రూం ఇళ్ల విషయంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క , మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే, ఈ మాటల యుద్ధం మలుపులు తిరిగింది.
హాట్ హాట్ సవాల్…
అసెంబ్లీలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ, “హైదరాబాద్ లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం ఎన్ని దరఖాస్తులు వచ్చాయి ? ఎంత మందికి ఇచ్చారు? గత ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు? మళ్లీ ఎన్నికలు వస్తున్నందునే ఇళ్లను పంపిణీ చేస్తామని అంటున్నారు` అని మండిపడ్డారు. అయితే, ఈ సందర్బంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందిస్తూ, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం విషయంలో స్వయంగా భట్టి ఇంటికి వెళ్లి ఆయనను తీసుకెళ్లి డబుల్ బెడ్ ఇళ్ల నిర్మాణాలను చూపిస్తానని ప్రకటించారు. లక్ష ఇళ్లను చూపిస్తానంటే రావడానికి తాను సిద్ధమేనన్నారు భట్టి. దీంతో హైదరాబాద్ లో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను చూపించేందుకు భట్టి ఇంటికి మంత్రి తలసాని వెళ్లారు.
ఇక్కడే ట్విస్ట్
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటన నేపథ్యంలో…తాను మంత్రి తలసాని కోసం ఎదురుచూస్తున్నానని తలసాని కట్టిన లక్ష ఇండ్లు ఎక్కడో చూపించాలని అన్నారు. 70 వేల కోట్లతో హైదరాబాద్ లో జరిగిన అభివృద్ధి ఎక్కడో చూస్తామన్న ఆయన రాత్రి కురిసిన వర్షాలకు నగరంలో రోడ్లు ఏమయ్యాయో కూడా చూస్తామని అన్నారు. 2 లక్షల ఇండ్లు ఇస్తా అని చెప్పాడని, ఎన్నికలు వచ్చాయి కాబట్టి… మళ్ళీ డబుల్ బెడ్ రూమ్ అంటున్నారని అన్నారు. 3 గంటల వరకు చూస్తా తర్వాత నేనే తలసానికి కాల్ చేస్తా… ఇంటికి వెళ్తానని భట్టి పేర్కొన్నారు.
మాట నిలబెట్టుకున్న తలసాని…
అయితే, ఇచ్చిన మాట ప్రకారం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఇంటికి మంత్రి తలసాని వెళ్లారు. హైదరాబాద్ లో ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్లను మంత్రి తలసాని, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు చూపించారు. అనంతరం మంత్రి తలసాని మీడియాతో మాట్లాడుతూ, సిటీలో కొన్ని ప్రదేశాలు చూశాం… ఇంకా 60 ప్రదేశాలు ఉన్నాయన్నారు. శుక్రవారం కొల్లూరు, కుత్బుల్లాపూర్, ఎల్బీనగర్ లో చూస్తామని పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఈ స్థలంలో ఉన్నవారి కోసం కట్టినవి… కొత్త వారి కోసం మిగిలిన చోట నిర్మాణాలు ఉన్నాయన్నారు. రేపు కూడా తిరుగుతాం… వీలైనంత తొందరగా పూర్తి చేయాలన్నది మా ఆలోచన అని తెలిపారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణంలో భట్టి కూడా సంతృప్తి చెందారు…లక్ష ఇండ్లు చూపించే వరకు భట్టి ని తిప్పుతానని మంత్రి తలసాని వెల్లడించారు. పేదలు గొప్పగా బతకాలనే ఆలోచనే సీఎం కేసీఆర్ చేస్తున్నారని చెప్పిన మంత్రి తలసాని ఇందిరమ్మ ఇండ్లలో లబ్ధిదారులు కొంత డబ్బులు కట్టాలని అయితే, డబుల్ బెడ్ రూమ్ ఇడ్లు పూర్తి ఉచితమని తెలిపారు.