ఏపీలో సాధారణ ఎన్నికల వేళ రాజకీయం మామూలుగా లేదు. జంపింగ్లు జరుగుతున్నా కొన్ని జంపింగుల్లో అదిరిపోయే ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా విజయనగరం జిల్లాలోని శృంగవరపుకోట నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు సతీమణి సుధారాణి నేతృత్వంలో వివిధస్థాయిల వైసిపి నాయకులు యువనేత లోకేష్ సమక్షాన సోమవారం టిడిపిలో చేరారు. 15 మంది సర్పంచులు, 17 మంది ఎంపిటిసిలు, 5గురు కన్వీనర్లతో సహా 150మంది పార్టీ ముఖ్యనేతలు సోమవారం భారీకాన్వాయ్ తో ఉండవల్లిలోని చంద్రబాబు వద్దకు నివాసానికి చేరుకుని టీడీపీ కండువాలు కప్పుకున్నారు.
ఇంకా చెప్పాలంటే ఓ ఎమ్మెల్సీ భార్యతో పాటు ఈ స్థాయిలో ఎంపీటీసీలు, సర్పంచ్లు పార్టీ మారిపోయారంటే నియోజకవర్గంలో వైసీపీ చాలా వరకు ఖాళీ అయిపోయిందనే చెప్పాలి. టీడీపీలో చేరిన వారిలో ఎస్.కోట ఎంపీపీ సంధి సోమేశ్వరరావు, ఎంపీటీసీ లాగుడు లక్ష్మి, ఎంపీటీసీ మోపాడ గౌరీశ్వరి, ఎంపీటీసీ-1 దారా గిరి, ఎంపీటీసీ-2 మజ్జి దేవి, ఎంపీటీసీ-4 వాకాడ సింహాచలం, ఎంపీటీసీ-5 మోపాడ సునీత, ఎంపీటీసీ-6 బి.ఆదిలక్ష్మి, ఎంపీటీసీ భోజంకి వెంకటలక్ష్మి, మండల కో-ఆప్షన్ మెంబర్ షేక్ బషీర్, సర్పంచ్ లు సోలుబొంగు కనకం, రామకృష్ణ, సంతోషి కుమారి, వొబ్బిన త్రినాథమ్మ, లాగుడు సూర్యనారాయణ, ఎర్ర సన్యాసిరావు తదితరులు ఉన్నారు.
పార్టీలో చేరిన ఎమ్మెల్సీ రఘురాజు భార్య సుధారాణి వైసీపీపై తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. ఎస్.కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు నియోజకవర్గాన్ని కబ్జాల కోటగా మార్చేశారని… వైసీపీలో ఎన్నో అవమానాలు, ఇబ్బందులు ఎదుర్కొన్నాం. మాకు అక్కడ ఎలాంటి ఆత్మగౌరవం లేదు. మా సమస్యలను జగన్ రెడ్డి ఏనాడూ పట్టించుకోలేదు. నియోజకవర్గ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు కబ్జాల కడుబండిగా పేరు గడించారు.. తెలుగుదేశం పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని నమ్మి ఇక్కడకు వచ్చాం. ఇక్కడ కార్యకర్తలకు గౌరవం ఉంటుందని.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయానికి, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసేందుకు మనస్ఫూర్తిగా పనిచేస్తామని చెప్పారు.
ఏదేమైనా ఎస్ కోటలో ఇది వైసీపీకి భారీ షాక్గా రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఎస్ కోట విశాఖపట్నం పార్లమెంటు పరిధిలో ఉంది. ఇక ఎస్ కోట టీడీపీ టిక్కెట్ కోసం మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ కోళ్ల లలితకుమారి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గొంప కృష్ణ పోటీపడుతున్నారు. ఈ చేరికలు ఇక్కడ టీడీపీలో మామూలు ఉత్సాహం నింపలేదనే చెప్పాలి.