ఏపీలో పొత్తులు, మార్పులు చేర్పుల నేపథ్యంలో చాలా మంది తెలుగుదేశం సీనియర్ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు, 20 ఏళ్ల నుంచి పార్టీనే నమ్ముకుని ఉన్న వాళ్లలో కొందరు సీట్లు త్యాగం చేయాల్సిన పరిస్థితి. ఇటు జనసేన, అటు బీజేపీ రెండు పార్టీలతో టీడీపీ పొత్తు పెట్టుకుని వారికి ఏకంగా 8 పార్లమెంటు సీట్లతో పాటు 31 అసెంబ్లీ సీట్లు ఇవ్వడంతో పలువురు టీడీపీ కీలక నేతలకు సీట్లు దక్కలేదు. సీట్లు దక్కని టీడీపీ నేతల్లో చాలా మంది అసమ్మతి స్వరాలు వినిపిస్తున్నారు. చంద్రబాబు, లోకేష్పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. చివరకు జనసేన అధినేత పవన్ పోటీ చేస్తోన్న పిఠాపురంలోనూ మాజీ ఎమ్మెల్యే ముందు అసమ్మతి గళం వినిపించినా తర్వాత చంద్రబాబు సర్దిచెప్పడంతో చల్లబడ్డారు.
పెనమలూరులో బోడే ప్రసాద్, విజయవాడ వెస్ట్లో బుద్ధా వెంకన్న, తెనాలిలో ఆలపాటి రాజా ఇలా చాలా మంది సీట్లు వదులుకున్న వాళ్లంతా అసంతృప్తితో ఉండడమో ఇక మాకు సంబంధం లేదు అని పార్టీని వదిలేయడమో చేస్తున్నారు. కానీ ఉంగుటూరు సీటు జనసేన కోసం త్యాగం చేసిన ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు, ఇటు పల్నాడు జిల్లా పెదకూరపాడు సీటు మరో టీడీపీ యువనేతకు వదులుకున్న మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీథర్ ఇద్దరూ కూడా తమ స్థానాల్లో సీట్లు వచ్చిన వారికి సహకరిస్తామని చెప్పడంతో పాటు మనస్ఫూర్తిగా పని చేస్తున్నారు.
ఉంగుటూరులో గన్నిది 20 ఏళ్ల టీడీపీ రాజకీయం. ఏనాడు పార్టీ మాట జవదాటలేదు.. చంద్రబాబు, లోకేష్ను కాదనలేదు. పొత్తులో తన సీటు జనసేన నాయకుడు పత్సమట్ల ధర్మరాజుకు ఇస్తున్నామని బాబు చెప్పారు. నీ భవిష్యత్తుకు నాది అని హామీ ఇచ్చారు. ఉంగుటూరు టీడీపీ కేడర్లో ఒక్కసారి ఆగ్రహావేశాలు, అసమ్మతి గళాలు బయటకు వచ్చాయి. జనసేనకు సహకరించేదే లేదని చెప్పారు. గన్ని మాత్రం తన నియోజకవర్గ కేడర్ను సముదాయించి.. పొత్తు ధర్మం కోసం.. చంద్రబాబు సీఎం అయ్యేందుకు ఎవరైనా త్యాగానికి రెడీగా ఉండాలని సర్ది చెప్పడంతో పాటు నియోజకవర్గ విస్తృత స్దాయి సమావేశం ఏర్పాటు చేసి జనసేన అభ్యర్థి పత్సమట్ల ధర్మరాజును ఆహ్వానించి.. ఆయన్ను గెలిపించే బాధ్యత తీసుకుంటానని చెప్పారు. ధర్మరాజు గన్ని దంపతులకు పాదాభివందనం చేసి మరి ఆశీర్వచనాలు తీసుకున్నారు.
పైగా టీడీపీ నియోజకవర్గ నాయకులు, మండల పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గంలో ఉన్న పార్టీ నేతలతో పాటు క్లస్టర్ ఇంచార్జులు, యూనిట్ ఇంచార్జులు, బూత్ ఇంచార్జులు, ఎన్నికల కోసం తాను రెడీ చేసుకున్న టీంను అంతా పిలిచి ధర్మరాజును గెలిపించడమే మన లక్ష్యం అని చెప్పారు. కూటమి సందర్భంగా క్షేత్రస్థాయిలో ఉన్న ఇబ్బందులను పరస్పరం సహకరించుకోవాలని ఇటు గన్ని, అటు ధర్మరాజు అనుకున్నారు. అటు కూటమి అభ్యర్థి ధర్మరాజు మాట్లాడుతూ తాను గెలిచినా.. అది గన్ని వీరాంజనేయులు గారు గెలిచినట్టే అని.. టీడీపీ వాళ్లు చెప్పిన సమస్యలను కూడా ఇద్దరం కలిసి కూర్చొని పరిష్కరించుకుంటాం.. మన ముందున్న ఉమ్మడి శత్రువు జగన్ను కొట్టడం… నియోజకవర్గంలో బలంగా ఉన్న టీడీపీ కేడర్ ముందుండి నడిస్తే… మీం అంతా మీకు అండగా ఉంటామని చెప్పారు.
ఇలా ఈ ఇద్దరి నేతల సమన్వయంతో నియోజకవర్గంలో టీడీపీ – జనసేన కేడర్లో కలిసికట్టుగా ఒక్కసారిగా ఊపొచ్చింది. అలాగే ఇరువురు నేతలు కూడా క్షేత్రస్థాయిలో ఇబ్బందులు ఉన్నప్పుడు జనసేన, టీడీపీ కేడర్ ఒకరిని ఒకరు కించపరుచుకునేలా పోస్టులు కూడా పెట్టకూడదని తీర్మానించుకున్నారు. ప్రచారం కూడా ఒక కమిటీలా ఏర్పడి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా పొత్తులో ఉన్న సీట్లలో ఇలా సీట్లు రాని టీడీపీ నేతలు జనసేన నాయకులకు సపోర్ట్ చేసుకుంటే ఆయా నియోజకవర్గాల్లో పొత్తు వార్ వన్ సైడ్ చేసి మరి విక్టరీ కొడుతుందనడంలో సందేహం లేదు.
భాష్యం ప్రవీణ్కు మనస్ఫూర్తిగా వెల్ కం చెప్పిన కొమ్మాలపాటి…
అటు పెదకూరపాడులో 2009, 2014 ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు గెలిచిన మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి సీనియర్ నేతగా ఉన్నారు. 2019లో మాత్రమే ఓడినా కొమ్మాలపాటి ఐదేళ్లుగా నియోజకవర్గంలో కాలికి బలపం కట్టుకుని తిరిగారు. సీటు కూడా ఆయనకే వస్తుందనుకున్నా చివర్లో యువనేత భాష్యం ప్రవీణ్కు సీటు కేటాయించారు. ముందుగా కొమ్మాలపాటితో పాటు ఆయనతో 15 ఏళ్లకు పైగా ట్రావెల్ అవుతోన్న కేడర్ కాస్తంత బాధపడ్డా తర్వాత చంద్రబాబును సీఎం చేయడమే మన ముందున్న లక్ష్యం అంటూ భాష్యం ప్రవీణ్కు మనస్ఫూర్తిగా సహరించడం స్టార్ట్ చేయడంతో నియోజకవర్గ టీడీపీ కేడర్లో ఎక్కడా లేని ఊపు వచ్చింది.
ఏదేమైనా చాలా నియోజకవర్గాల్లో సీట్లు వదులుకున్న వారంతా రకరకాలుగా అసంతృప్తి గళాలు వినిపిస్తూ చంద్రబాబుకు ఇబ్బందులు క్రియేట్ చేస్తుంటే అందుకు భిన్నంగా గన్ని, కొమ్మాలపాటి లాంటి ఒకరిద్దరు నేతలు మాత్రం మా నాయకుడు చంద్రబాబు సీఎం కావడమే మా లక్ష్యం అంటూ త్యాగాలు చేస్తూ తమ స్థానాల్లో టిక్కెట్లు వచ్చిన నేతలను గెలిపించేందుకు కంకణం కట్టుకోవడం… మనస్ఫూర్తిగా కష్టపడుతుండడం విశేషం. ఇదే పరిస్థితి అన్ని నియోజకవర్గాల్లోనూ ఉంటే టీడీపీ నినాదం వైనాట్ 175 ఎందుకు కాకూడదు అనుకోవాలి…!