బంగాళాఖాతంలో ఈ నెల 20వ తేదీన అల్పపీడనం ఏర్పడుతుందనీ, అది క్రమేపీ బలపడి పెను తుఫానుగా మారుతుందంటూ నిన్న సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. ఈ వార్తలతో ప్రజలు ఆందోళన కూడా చెందుతున్నారు. అయితే ఈ వార్తలపై భారత వాతావరణ విభాగం (ఐఎండీ) స్పందించింది. సూపర్ సైక్లోన్ వస్తుందంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదనీ, అది అంతా ఉట్టి వదంతేనని ఐఎండీ స్పష్టం చేసింది. ఆ తుఫానుకు సిత్రాంగ్ అని పేరు పెట్టినట్లుగా కూడా వచ్చిన వార్తల్లో నిజం లేదని పేర్కొంది. ఐఎండీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మహాపాత్ర పెను తుఫాను పుకార్లపై స్పందించి వివరణ ఇచ్చారు. ప్రజలు ఈ పుకార్లు నమ్మవద్దని సూచించారు. సూపర్ సైక్లోన్ అంటూ తాము హెచ్చరిక ఏమీ జారీ చేయలేదని స్పష్టం చేశారు.
కెనడాలోని సస్కాచెవాన్ యూనివర్శిటీ లో వాతావరణ శాస్త్రంలో పీహెచ్ డీ చేస్తున్న ఓ విద్యార్ధి బంగాళాఖాతంలో సూపర్ సైక్లోన్ ఏర్పడనుందన్న అంచనాలు వెలువరించినట్లు తెలుస్తొందని, దాని ఆధారంగానే తుఫానుపై వదంతులు వచ్చినట్లు తెలుస్తొంది. కాగా ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాల కారణంగా కృష్ణానదికి వరద ప్రభావం కొనసాగుతోంది. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల నుండి నాలుగు లక్షల క్యూసెక్కుల మేర దిగువకు నీరు విడుదల అవుతుండగా, ప్రకాశం బ్యారేజీ వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 5 లక్షల క్యూసెక్కులు కొనసాగుతోంది. దీంతో కృష్ణానది పరివాహాక ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.