ఉమ్మడి విజయనగరం జిల్లాలోని పార్వతీపురం నియోజకవర్గం పార్టీలను ముఖ్యంగా నాయకులను కలవరపెడుతోంది. జిల్లా లు విభజన తరువాత ఈ నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేశారు. అయినప్పటికీ.. వైసీపీలో ఆదిశగా జోష్ అయితే కనిపించడం లేదు. దీనికి కారణం.. స్థానికంగా ఉన్న సమస్యలను పరిష్కరించకపోవడమేననే చర్చ ఉండడమే. ఈ నియోజక వర్గంలో అత్యధికంగా ఇప్పటి వరకు 17సార్లు ఎన్నికలు జరిగాయి. ఆరుసార్లు టీడీపీ, ఐదుసార్లు కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించగా, గడిచిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి విజయాన్ని దక్కించుకున్నారు.
1983లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన ఎంవీ నాయుడు విజయం సాధించారు. 1985 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన ఎంవీ నాయుడు రెండోసారి విజయం సాధించారు. 1989లో జరిగిన ఎన్నికల్లో కూడా టీడీపీ మరోసారి గెలుపు గుర్రం ఎక్కింది. 1994లో జరిగిన ఎన్నికల్లోనూ అభ్యర్థి మారినా టీడీపీ విజయం సాధించింది. 1997లో జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన ఎర్రా అన్నపూర్ణమ్మ విజయం దక్కించుకున్నారు. 1999లో మాత్రం కాంగ్రెస్ ఇక్కడ పాగా వేసింది. 2004లోనూ ఈ పార్టీనే విజయం సాధించింది. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన సవరపు జయమణి కూడా గెలుపు గుర్రం ఎక్కారు.
అయితే, రాష్ట్ర విభజన నేపథ్యంలో 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి బొబ్బిలి చిరంజీవులు గెలుపొందారు. అయితే, ఆయనపై ఆరోపణలురావడంతో 2019లో జరిగిన ఎన్నికల్లో ప్రజలు వైసీపీ అభ్యర్థి ఏ జోగారావుకు విజయం కట్టబెట్టారు. ఇక, రానున్న ఎన్నికల్లో ఇక్కడ విజయం దక్కించుకునేందుకు అధికార, ప్రతిపక్షాలు హోరాహోరీగా పోరాడుతున్నాయి. టీడీపీ బోనే విజయ్కు సీటు కన్ఫార్మ్ అయ్యింది. వైసీపీ నుంచి సిటింగ్ ఎమ్మెల్యేతోపాటు మరో ఇద్దరు ప్రయత్నాలు సాగిస్తున్నారు. అయితే.. ఎవరికీ టీడీపీ టికెట్ కన్ఫర్మ్ చేయలేదు. మరోవైపు.. ఈటికెట్ను జనసేన ఆశిస్తున్నట్టు ప్రచారం చేస్తున్నారు.
ఇక, బలాబలాల విషయానికి వస్తే.. వ్యక్తుల బలం కన్నా.. ప్రజల్లో సెంటిమెంటు ఎక్కువగా కనిపిస్తోంది. వరుస విజయాలు ఇవ్వడం ఈ నియోజకవర్గం ప్రత్యేకత. పార్టీలకు ఉన్న చరిష్మా, తమ నియోజకవర్గంలో నాయకుడు అందుబాటులో ఉండడం వంటి కీలక విషయాలను ఇక్కడి ప్రజలు ఎక్కువగా పరిగణనలోకి తీసుకుంటున్నారు. దీంతో టీడీపీ, వైసీపీ నాయకులు ప్రజల మధ్య ఉండేందుకు వారి సమస్యలు పరిష్కరించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. అయితే.. జిల్లా కేంద్రంగా చేసినప్పటికీ.. రవాణా సదుపాయం వంటివి కల్పించకపోవడం వైసీపీకి మైనస్గా మారింది. మరి ఎవరు ?గెలుస్తారో చూడాలి.