విశాఖ సౌత్ టిడిపి ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ చేరికతో వైసీపీ బలోపేతం కావడం ఖాయంగా కనిపిస్తోంది.అదే సమయంలో టిడిపి విశాఖపట్నంలో నేలమట్టం కానున్న సూచనలు గోచరిస్తున్నాయి.
ఇప్పటి వరకు వైసిపి ముగ్గురు టిడిపి ఎమ్మెల్యేలను చేర్చుకున్నప్పటికీ వారి వల్ల పెద్దగా పార్టీకి లాభించిందేమీలేదు.కానీ వాసుపల్లి వల్ల విశాఖ పట్టణంలో వైసిపి పూర్తిస్థాయిలో విస్తరించనున్నట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.మొన్నటి ఎన్నికల్లో విశాఖపట్నంలోని నాలుగు స్థానాలను టిడిపి గెల్చుకున్నదంటే అందుకు నగర పార్టీ అధ్యక్షునిగా ఉన్న వాసుపల్లి గణేష్ ప్రతిభా పాటవాలు కూడా దోహదపడ్డాయి.విశాఖలో పార్టీపై వాసుపల్లికి పూర్తి పట్టుంది.టిడిపి నాయకులు కార్యకర్తలు ఆయనంటే గౌరవిస్తారు.
ప్రజలకి కూడా వాసుపల్లి అంటే అభిమానమే!అందుకే ఆయన రెండు సార్లు వరుసగా ఎమ్మెల్యే కాగలిగారు. ఈ నేపథ్యంలో వాసుపల్లి చేరికతో వైసీపీబలం పెరగడం ఖాయమంటున్నారు. వాసుపల్లి చిటికేస్తే టిడిపి క్యాడర్ అంతా వైసీపీలోకి రావడం తథ్యం. ఇంకా చెప్పాలంటే టిడిపిని వాసుపల్లి ఒక రోజులో ఖాళీ చేయించగలరు. వైసీపీలో చేరిన సందర్భంగా వాసుపల్లి మాట్లాడుతూ టిడిపి పని అయిపోయిందని ప్రకటించటం గమనార్హం. పార్టీ సీనియర్ ఎమ్మెల్యే గా, టిడిపి నగర అధ్యక్షుడు గా ఉన్న వాసుపల్లి ఇలాంటి వ్యాఖ్యలు చేశారంటే టీడీపీ అసలు బలం ఏమిటో అర్థమవుతుంది!
అంతేకాకుండా అవసరమైతే విశాఖ నార్త్ నుంచి వై సీపీ అభ్యర్థిగా ఉప ఎన్నికల్లో పోటీచేసి గెలుస్తానని మరీ వాసుపల్లి సవాల్ విసిరారు. తాను వైసీపీలో చేరడానికి ప్రజామోదం ఉందని తెలియజేయడానికి త్వరలోనే విశాఖ నార్త్ లో వాసుపల్లి పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేయబోతున్నారు. కాగా చంద్రబాబు కూడా వాసుపల్లి పార్టీ మారడం పట్ల ఆందోళన గా ఉన్నారట. ఇంతకుముందు ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీ మారినప్పుడు ఏ మాత్రం కలత చెందని చంద్రబాబు ఇప్పుడు వాసుపల్లి వైసీపీలో చేరడం పట్ల ఆందోళన చెందుతున్నారని బాబు సన్నిహిత వర్గాలు చెప్పాయి. వాసుపల్లి పార్టీ మారిన వ్యవహారం టిడిపి బీసీలపై ప్రభావం చూపుతుందని అంటున్నారు.వాసుపల్లి పార్టీ మారి చంద్రబాబుకు చుక్కలు చూపిస్తున్నారని టీడీపీ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. వైసీపీ కూడా ఇన్నాళ్ళకు కరెక్ట్ టీడీపీ ఎమ్మెల్యే ను క్యాచ్ చేసింది అంటున్నారు.