కర్నాటకలో అధికారంలో ఉన్న కుమార స్వామి ప్రభుత్వం సరిగ్గా నెల రోజులలో కుప్పకూలిపోవడం ఖాయమని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు ఎడ్యూరప్ప జోస్యం చెప్పారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న జనతాదళ్ ఎస్- కాంగ్రెస్ సంకీర్ణాన్ని కూలదోయడానికి తామేమీ ప్రయత్నాలు చేయడం లేదని చెప్పిన యెడ్యూరప్ప…ఆ ప్రభుత్వం తనంతట తానే కూలిపోతుందని పేర్కొన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల నాటికి కుమారస్వామి సర్కార్ అధికారం కోల్పోవడం ఖాయమన్నారు. కుమారస్వామి తన మంత్రివర్గాన్ని విస్తరించిన అనంతరం కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైన సంగతి తెలిసిందే.
కొలువు తీరిన నాటి నుంచీ సంకీర్ణంలోని భాగస్వామ్య పార్టీల మధ్య విభేదాలు తరచూ బహిర్గతమౌతూ వస్తున్నాయి. తాజా కేబినెట్ విస్తరణ తరువాత కాంగ్రెస్ లో అసంతృప్తి భగ్గుమంది. ఈ నేపథ్యంలోనే యెడ్యూరప్ప కుమార స్వామి ప్రభుత్వం నెల రోజులలో కూలిపోవడం ఖాయమంటూ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.