YSRCP: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేపట్టిన `మేమంతా సిద్ధం’ యాత్ర నాలుగో రోజు అట్టహాసంగా ప్రారంభమైంది. పత్తికొండలోని రాత్రి బస చేసిన ప్రాంతం దగ్గర నుంచి ప్రారంభమైన బస్సు యాత్ర రాతన మీదుగా మరి కాసేపట్లో తుగ్గలి చేరుకోనుంది. సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రలో పాల్గొనేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు తరలివచ్చారు. జగన్ కు జై కొడుతూ, పూల వర్షం కురిపిస్తూ తమ అభిమానాన్ని చాటుతున్నారు.
కాగా, స్టే పాయింట్ వద్ద ముఖ్యమంత్రి వైయస్ జగన్ సమక్షంలో వైసీపీలోకి కళ్యాణదుర్గం నియోజకవర్గ టీడీపీ నేతలు చేరారు. కళ్యాణదుర్గం నియోజకవర్గం టీడీపీ ఇన్ ఛార్జ్ ఉమామహేశ్వర నాయుడు ఆధ్వర్యంలో పలువురు కీలక నేతలు వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు. వారికి సీఎం వైఎస్ జగన్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.
పార్టీలో చేరిన వారిలో టీడీపీ సీనియర్ నేత, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ వై నారాయణ, మాజీ ఎంపీపీ, టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ కె కొల్లప్ప, టీడీపీ పార్లమెంట్ సెక్రటరీ, క్లస్టర్ ఇన్ఛార్జ్ టి సత్యప్ప, జనరల్ సెక్రటరీ(కంబదూరు) పి ఆనంద్ చౌదరి, కళ్యాణదుర్గం రూరల్ జనరల్ సెక్రటరీ కె మల్లిఖార్జున, జనరల్ సెక్రటరీ(శెట్టూరు) ఆదిశేషు. కళ్యాణదుర్గం రూరల్ ఎంపీటీసీ బి ఓబయ్య, కంబదూరు మాజీ జెడ్పీటీసీ అభ్యర్ధి మంజునాథ్ చౌదరి, శెట్టూరు మాజీ మండల పార్టీ కన్వీనర్ పి రంగనాథ్ శెట్టి ఉన్నారు.
కళ్యాణదుర్గం టీడీపీ టికెట్ కోసం ఉమామహేశ్వర్ నాయుడు, మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతు రాయ చౌదరి లు తీవ్రంగా పోటీ పడ్డారు. 2019 ఎన్నికల్లో ఉమామహేశ్వర్ నాయుడు టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి వైసీపీ అభ్యర్ధి ఉషశ్రీ చరణ్ చేతిలో పరాజయం పాలైయ్యారు. ఆ తర్వాత పార్టీ ఇన్ చార్జిగా కొనసాగారు. అయితే 2014 లో ఎన్నికల్లో టీడీపీ తరపున గెలిచిన ఉన్నం హనుమంతు రాయ చౌదరి ఈ సారి ఎన్నికల్లో పోటీకి దిగాలని ఆశించారు. ఈ ఇరువురి నేతల మధ్య తీవ్ర స్థాయిలో విభేదాలు ఉండటంతో పార్టీ అధిష్టానం ఈ ఇద్దరు నేతలను పక్కన పెట్టి మూడో వ్యక్తికి టికెట్ ఇచ్చారు.
అమిలినేని సురేంద్ర బాబును తీసుకొచ్చి కళ్యాణదుర్గం కూటమి అభ్యర్ధిగా ప్రకటించారు. టీడీపీ హైకమాండ్ తీసుకున్ నిర్ణయంతో తీవ్ర మనస్థాపానికి గురైయ్యారు ఉమామహేశ్వర నాయుడు. గత కొద్ది కాలంగా పార్టీకి అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తూ వచ్చారు. పలు మార్లు అనుచరులతో సమావేశమై భవిష్యత్తు కార్యచరణపై చర్చించారు. పార్టీలో తనకు అవమానం జరిగిందని భావిస్తున్న ఉమామహేశ్వర నాయుడు పార్టీ మారాలని నిర్ణయానికి వచ్చారు.
ఈ నేపథ్యంలో నిన్న రాత్రి ఉమామహేశ్వర నాయుడు ఇంటికి కళ్యాణదుర్గం వైసీపీ అభ్యర్ధి, ఎంపీ తలారి రంగయ్య, రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ఇతర వైసీపీ నేతలు వెళ్లి చర్చలు జరిపారు. వైసీపీలోకి రావాలని ఆహ్వానించారు. వీరి ఆహ్వానంతో ఇవేళ జగన్ సమక్షంలో తన వర్గీయులతో ఉమామహేశ్వర నాయుడు వైసీపీలో చేరారు.