Konijeti Rosaiah: రాజకీయాల్లో తొలి తరం నేత కొణిజేటి రోశయ్య ఇక లేరు. దాదాపు ఆరు దశాబ్దాలపైగా క్రీయాశీల రాజకీయాల్లో కొనసాగిన ఆయన జీవితం నేటి తరం నేతలకు ఆదర్శ ప్రాయం. సుధీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్న అవినీతి మరక అంటకుండా నిజాయితీ, నిబద్దతతో ఒకే పార్టీలో కొనసాగిన నేతగా రికార్డు సొంతం చేసుకున్నారు. కర్షక నాయకుడు ఎన్జీ రంగా శిష్యుడుగా పేరొందిన రోశయ్య స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని జైలుకు కూడా వెళ్లారు.
Konijeti Rosaiah: 1968 నుండి రాజకీయ ప్రస్థానం ఇలా..
కాంగ్రెస్ పార్టీ నుండి తొలి సారిగా 1968లో ఏపి శాసనమండలిలో అడుగుపెట్టారు. తరువాత రెండవ సారి 1974లో ఎమ్మెల్సీగా ఎన్నికైన తరువాత టంగుటూరి అంజయ్య మంత్రివర్గంలో రవాణ, గృహ నిర్మాణం, వాణిజ్య పన్నుల శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. మూడవ సారి 1980లో మూడవ సారి శాసనమండలి ఎన్నికైన తరువాత 1982లో కోట్ల విజయభాస్కరరెడ్డి మంత్రివర్గంలో హోంశాఖ బాధ్యతలు నిర్వహించారు. 1989లో ప్రకాశం జిల్లా చీరాల నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై మర్రి చెన్నారెడ్డి మంత్రివర్గంలో ఆర్ధిక, రవాణా, విద్యుత్ శాఖలు, 1991లో నెదురుమల్లి జనార్ధనరెడ్డి ప్రభుత్వంలో ఆర్ధిక, ఆరోగ్య, విద్య, విద్యుత్ శాఖలను నిర్వహించారు. 1992లో కోట్ల విజయభాస్కరరెడ్డి ప్రభుత్వంలో ఆర్ధిక, ఆరోగ్య, విద్య, విద్యుత్ శాఖల మంత్రిగా పని చేశారు. 1995 నుండి 97వరకూ పీసీసీ అధ్యక్షుడుగా బాధ్యతలు నిర్వహించారు. 1998లో గుంటూరు జిల్లా నరసరావుపేట లోక్ సభ సభ్యుడుగా ఎన్నికైయ్యారు. మరల 2004లో చీరాల నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2004, 2009 లో వైఎస్ రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో ఆర్ధిక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. వైఎస్ మరణానంతరం 2009 సెప్టెంబర్ 3 నుండి 2010 నవంబర్ 24వరకూ ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగారు. తొలి నుండి కాంగ్రెస్ అధిష్టానానికి నమ్మిన వ్యక్తిగా ఉండటంతో 2011లో తమిళనాడు గవర్నర్ గా కేంద్రం నియమించింది. 2016 ఆగస్టు 30 వరకూ ఆయన గవర్నర్ గా సేవలు అందించారు.
అయిదు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలోనే..
రాజకీయాల్లో విలువలు ఉన్న నేతగా రోశయ్యకు పేరు ఉంది. పదవుల కోసం పార్టీలు మారే నాయకులు ఉన్న నేటి రాజకీయాల్లో అధికారంలో ఉన్నా లేకున్నా ఒకే పార్టీలో కొనసాగారు. రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ పార్టీలోని అనేక మంది సీనియర్ నాయకులు పార్టీ వీడి బయటకు వెళ్లినా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న కొద్ది మంది నేతల్లో రోశయ్య కూడా ఒకరు. రోశయ్య కాంగ్రెస్ పార్టీకే కంకణబద్ధులుగా చివరి శ్వాస వరకూ ఉన్నారు.
అవినీతి ఆరోపణలు లేకుండా..
రాజకీయాల్లో అవినీతి ఆరోపణలు లేకుండా నెట్టుకురావడం చాలా కష్టం. కానీ రోశయ్య అయిదు దశాబ్దాలకు పైగా రాష్ట్ర స్థాయిలో అనేక పదవులు అలంకరించినా ఆయన పదవులకే వన్నె తెచ్చారు. ప్రత్యర్ధులు కూడా ఆయనపై ఏనాడూ అవినీతి ఆరోపణలు చేసే వాళ్లు కాదు. రాజకీయాలకు అతీతంగా ఆయన వద్దకు ఎవరు వెళ్లినా పని చేసేవారు. అనేక వర్గాల అభిమానాన్ని ఆయన సొంతం చేసుకున్నారు. ప్రత్యర్ధి పార్టీ నేతలు కూడా రోశయ్య వ్యక్తిత్వాన్ని గౌరవించేవారు.