జనసేన పార్టీ అధినేత , సినీ నటుడు పవన్ కళ్యాణ్ …. ఒకింత బ్రేక్ తర్వాత తిరిగి తన పార్టీపై ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో పార్టీ ముఖ్య నేతలతో సమావేశాలు, కీలక ప్రకటనలు, రాజకీయ వ్యూహాలు అమలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇదే సమయంలో ఓ కీలక ప్రకటన చేసిన జనసేనాని ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని ప్రచారం జరుగుతోంది.
పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం…
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయడంతో అన్ని పార్టీలు పోటీకి సిద్ధమవుతున్నాయి. నోటిఫికేషన్ విడుదల అయిన రోజే గ్రేటర్ ఫైట్పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్రంలోనూ, జీహెచ్ఎంసీ పరిధిలో పార్టీలో క్రియాశీలకంగా ఉన్న కార్యకర్తలు, యువ జనసైనికుల నుంచి ఈ అంశంపై పలు విజ్ఞప్తులు వచ్చిన నేపథ్యంలో వారి వినతి మేరకు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీకి సన్నద్ధం కావాలని పార్టీ నాయకులకు, నగర పరిధిలోని కమిటీలకు పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేయాలని యువ కార్యకర్తల విజ్ఞప్తి మేరకు నిర్ణయం తీసుకున్నట్టు తన ప్రకటనలో పేర్కొన్నారు జనసేన అధినేత..
కానీ పవన్ …
ఓ వైపు గ్రేటర్ ఎన్నికల పోరును ప్రకటించిన జనసేనాని మరోవైపు ఫోకస్ మాత్రం ఏపీలో పెట్టారని అంటున్నారు. తెలంగాణ రాజధానిలో ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంత వాసులతో సమావేశయ్యారు. వారికి వివిధ అంశాలపై స్పందించారు. ఈ నేపథ్యంలో పవన్ తీరుపై సోషల్ మీడియాలో పలువురు విభిన్న వ్యాఖ్యలు చేస్తున్నారు.
పవన్ పార్టీ నేతల కీలక ప్రకటన
ఇదిలాఉండగా గ్రేటర్ బరి విషయంలో తెలంగాణ జనసేన క్రియాశీలంగా ముందుకు సాగుతోంది. మొత్తం 14 నియోజకవర్గాల్లో పోటీకి దిగుతున్నాం అని చెప్పిన తెలంగాణ జనసేన ఇంచార్జీ శంకర్ గౌడ్ 45 నుండి 60 డివిజన్లలో పోటీకి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. 25 నుండి 30 మందితో మొదటి జాబితా ఉంటుందని ప్రకటించారు. ఉప్పల్,మల్కాజిగిరి, ఎల్బీనగర్, జూబ్లీహిల్స్, కుత్బుల్లాపూర్, కూకట్ పల్లి, షేర్ లింగం పల్లి , ఖైరతాబాద్, కార్వాన్, అంబర్ పేట, సనత్ నగర్, పఠాన్ చెరువు, ముషీరాబాద్ లలో పోటీ చేయనున్నట్లు తెలిపారు. ఎక్కడైతే మాకు బలం ఉందొ అక్కడ పోటీ చేయాలని నిర్ణయించాం.. పార్టీ కార్యక్రమంలో చురుగ్గా ఉన్న అభ్యర్థులకు టికెట్లు ఖరారు చేసాము అని శంకర్ గౌడ్ అన్నారు.