Mamata Banerjee: ఎన్నికలు ముగిశాక కూడా పశ్చిమబెంగాల్ రాజకీయాల చిటపటలు ఇంకా ఆరలేదు.బిజెపి టఫ్ ఫైట్ ఇచ్చినప్పటికీ మూడోసారి కూడా ముఖ్యమంత్రి కాగలగినప్పటికీ మమతా బెనర్జీ ఇంకా కాషాయదళంపై కన్నెర్ర చేస్తూనే ఉన్నారు.ఒంటి చేత్తో పశ్చిమ బెంగాల్లో టీఎంసీ ని గెలిపించిన దీదీ నందిగ్రామ్ లో మాజీ టీఎంసీ సహచరుడు బీజేపీ అభ్యర్థి శుభేందు అధికారి చేతిలో తాను ఓడిపోవడాన్ని ఇంకా జీర్ణించుకోలేకున్నారు.పైగా నారదా కుంభకోణం లో ఇద్దరు టీఎంసీ మంత్రులను అరెస్టు చేసేంత వరకు సీబిఐ వెళ్లడాన్ని కేంద్రం కక్ష సాధింపు చర్యగా భావిస్తున్న మమతా బెనర్జీ సందర్భం వచ్చిన ప్రతిసారి నేరుగా ప్రధాని మోడీని టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నారు.తాజాగా కూడా మమతా బెనర్జీ అదే పంధాను అవలంబించడమే కాకుండా ఇతర ముఖ్యమంత్రులను కూడా ప్రధాని నరేంద్ర మోడీపై రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు.
సీఎంలను పీఎం తోలుబొమ్మలను చేశారు!
కరోనా కట్టడి చర్యలపై గురువారం ప్రధాని నరేంద్ర మోదీ పది రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కాన్ఫరెన్స్ నిర్వహించిన సందర్భంగా సీఎంలను తోలుబొమ్మల మాదిరి చూశారని మమతా బెనర్జీ ఆరోపించారు. ప్రధాని వైఖరి నియంత మాదిరి ఉందన్నారు. కొందరు బిజెపి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులకు తప్ప ఇతరులెవ్వరికీ ఈ సమావేశం లో మాట్లాడే అవకాశాన్ని ప్రధాని ఇవ్వలేదన్నారు.తాను ఈ సమావేశంలో మాట్లాడదలుచుకున్నా ఆ ఛాన్స్ తనకు ప్రధాని ఇవ్వలేదన్నారు.ప్రజలు పట్టం గట్టిన ఒక ముఖ్యమంత్రిని ప్రధాని మాట్లాడనీయకపోవటం సీఎం పదవికి తీవ్ర అవమానమని ఆమె వ్యాఖ్యానించారు.ముఖ్యమంత్రులను మాట్లాడనీయనప్పుడు వారిని ఎందుకు ఈ మీటింగ్ కి పిలిచారని ఆమె నిలదీశారు. ఇది తనకే కాకుండా ముఖ్యమంత్రులందరికీ జరిగిన అవమానం అన్నారు.ప్రధానితో ఇలాంటి ముఖ్యమైన సమావేశంలో మాట్లాడేందుకు అనుమతించకపోవడంపై అన్ని రాష్ట్రాల సీఎంలు నిరసన తెలపాలని దీదీ పిలుపు ఇచ్చారు.
సొంత డబ్బా కొట్టుకున్న ప్రధాని!
కరోనా ఉధృతి తగ్గిందని ప్రధాని సొంత డబ్బా కొట్టుకున్నారని ఆమె చెప్పారు. ఈ సమావేశంలో ముఖ్యమైన అంశాలేవీ చర్చకు రాలేదని ఆమె చెప్పారు.కరోనా నిరోధక మందులు,టీకాలకొరత, కొత్తగా తలెత్తిన బ్లాక్ ఫంగస్ వ్యాధి బెడద తదితరాల గురించి ప్రధాని ఏమీ మాట్లాడలేదన్నారు.కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయని ప్రధాని ఈ సమావేశంలో పేర్కొన్నారని, అదే నిజమైతే ప్రజలు ఎందుకు పిట్టల్లా రాలిపోతున్నారని మమతా బెనర్జీ సూటిగా ప్రశ్నించారు.నరేంద్రమోడీది అంతా షోబిజినెస్ అని ఆమె తేల్చేశారు. ఈ విషయాలన్నింటినీ పశ్చిమ బెంగాల్ ప్రజలకు తాను పూసగుచ్చినట్లు వివరిస్తానని ప్రధాని నిజస్వరూపాన్ని వారికి తెలియజేస్తానని మమతా బెనర్జీ చెప్పారు.