శ్రీనగర్: జమ్మూకాశ్మీర్లోని బుద్గాంలో భారత వాయుసేన(ఐఏఎఫ్)కు చెందిన మిలిటరీ హెలికాప్టర్ బుధవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు వాయుసేన అధికారులతోపాటు ఓ పౌరుడు మృతి చెందారని పోలీసులు వెల్లడించారు.
బుద్గాం జిల్లాలో గరెండ్ కలాన్ వద్ద ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. సాంకేతిక కారణాలతోనే హెలికాప్టర్ కూలిపోయింది. మంటలు త్వరగా వ్యాపించడంతో పైలెట్లు సజీవ దహనమయ్యారు. ఈ ఘటనను అధికారులు ధ్రువీకరించారు. ప్రమాదానికి గురైన హెలికాప్టర్ రష్యాలో తయారైన ఎంఐ-7గా గుర్తించారు.
ఈ ఘటన జరగడానికి కొద్ది సేపటి ముందు నియంత్రణ రేఖకు అత్యంత సమీపంలో పాకిస్థాన్కు చెందిన విమానాలు సంచరించినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. రాజౌరీ సెక్టార్కు సమీపంలో కూడా పాక్ యుద్ధవిమానాలు సంచరిస్తున్నాయి.
అంతేగాక, పలు ప్రాంతాల్లో బాంబులు విసిరినట్లు తెలిసింది. దీంతో భారత భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. వెంటనే భారత యుద్ధ విమానాలు రంగంలోకి దిగడంతో పాక్ విమానాలు తోకముడిచి అక్కడ్నుంచి జారుకున్నాయి.