అమరావతి, ఫిబ్రవరి 27: రాజధాని విషయంలో తమ వైఖరిపై జరుగుతున్న ప్రచారం ఎన్నికలలో ఇబ్బంది తెచ్చిపెడుతుందేమోనన్న అనుమానంతో వైసిపి ఆ విషయంలో స్పష్టత ఇచ్చింది. వైసిపి అధికారంలోకి వచ్చినా రాజధాని అమరావతిలోనే ఉంటుందని వైసిపి మ్యానిఫెస్టో కమిటీ అధ్యక్షుడు ఉమారెడ్డి వెంకటేశ్వర్లు మంగళవారం ప్రకటించారు. ఆ మరుసటి రోజే పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమరావతిలో కొత్తగా కట్టిన ఇంట్లోకి ప్రవేశించారు.
అయినా అధికార తెలుగుదేశం పార్టీ విమర్శ ఆపలేదు. ‘అందరికీ అందుబాటులో రాష్ట్రం నడిబొడ్డున అమరావతి నిర్మాణం జరుగుతుంటే రాజధాని ఇక్కడే అని వైసిపి మేనిఫెస్టోలో పెడతారట’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాజాగా వ్యాఖ్యానించారు.
‘అమరావతిలో శరవేగంగా రాజధాని పనులు జరుగుతున్నాయి, 50వేల కోట్ల రూపాయలతో ట్రంక్ ఇన్ప్రాస్ట్రక్ఛర్ పనులు జరుగుతున్నాయి, యాగ్జిలరీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రెయిన్లు, పార్కులు, ఐదు టవర్లుగా సెక్రటేరియట్, బౌద్ద స్థూపాకృతిలో హైకోర్టు నిర్మాణాలు జరుగుతున్నాయి. నాలుగేళ్లుగా మన గడ్డమీద నుండే పాలన సాగిస్తున్నాం’ అని చంద్రబాబు అన్నారు.
వైసిపి మేనిఫెస్టోలో రాజధాని ఎక్కడ అనే అంశం పెట్టడం చూస్తుంటే వారి దుర్బుద్ధి ఏంటో తెలుస్తోందని చంద్రబాబు అన్నారు.
‘నిన్నటి వరకూ హైదరాబాద్ వీడి జగన్మోహన్ రెడ్డి రాలేదు. పేలెస్ ఉంటే తప్ప జగన్ ఇక్కడ నివసించడు. ఎక్కడకు పోయినా రాజ ప్రాసాదాల్లోనే జగన్ బస. లోటస్ పాండ్ పేలెస్, బెంగళూరులో వైట్హైస్ పేలెస్, పులివెందుల పేలెస్, అమరావతిలో ఇప్పుడు ఇంకో పాలెస్. అని చంద్రబాబు విమర్శించారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పేదల పార్టీ కాదు, పేలెస్ల పార్టీ, ప్రజాసేవ పట్ల జగన్కు చిత్తశుద్ది లేదు అని చంద్రబాబు అన్నారు.
మోది విశాఖ సభకు వైసిపి జనాన్ని తరలిస్తోందనీ, గుంటూరు సభకు వైసిపి ద్వారానే జనం తరలింపు జరిగిందని చంద్రబాబు విమర్శించారు. బిజెపి, వైసిపి కుమ్మక్కును బైటపెట్టాలని చంద్రబాబు పునరుద్ఘాటించారు. అన్నివర్గాల ప్రజలను అప్రమత్తం చేయాలని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే టిడిపి పోరాటం చేస్తున్నదని చంద్రబాబు స్పష్టం చేశారు.
మార్చి ఒకటిన ప్రధాని మోది విశాఖ వస్తున్న సందర్భంగా ప్రత్యేక హోదా సాధన సమితి జెఏసి ఆధ్వర్యంలో చేస్తున్న ఆందోళనలకు టిడిపి తరపున పూర్తి మద్దతు ప్రకటిస్తున్నామని చంద్రబాబు తెలిపారు.
దేశ సమగ్రతలో తెలుగుదేశం పార్టీ రాజీపడదని చంద్రబాబు అన్నారు. దేశభక్తిలో టిడిపి అందరికన్నా ముందే ఉంటుందని చంద్రబాబు పేర్కొన్నారు. విదేశీ దాడులను అందరూ ముక్తకంఠంతో ఖండించాలని చంద్రాబాబు పిలుపు నిచ్చారు. పుల్వామా దాడిని అందరికన్నా ముందు మనమే ఖండించామని చంద్రబాబు చెప్పారు. జవాన్ల కుటుంబాలకు మన ఉద్యోగుల 30కోట్ల రూపాయల విరాళం దేశానికే స్ఫూర్తిదాయకమని చంద్రబాబు అన్నారు.
‘భారత వాయుసేన ధైర్యసాహసాలను అభినందిస్తామనీ, రాష్ట్ర హక్కుల కోసం ఒకవైపు రాజీలేని పోరాటం చేస్తూనే, మరోవైపు దేశ సార్వభౌమాధికారానికి మన సంఘీభావం ప్రకటిస్తున్నామని’ చంద్రబాబు తెలియజేశారు.
రాజకీయంగా పార్టీల మధ్య విబేధాలు ఉండవచ్చు కానీ దేశభద్రతలో రాజకీయాలకు అతీతం తెలుగుదేశం వ్యవహరిస్తుందని చంద్రబాబు స్పష్టం చేశారు.