వచ్చే ఎన్నికలకు సంబంధించి వైసీపీ పెట్టుకున్న వైనాట్175 లక్ష్యం మేరకు అందరూ కలిసి పనిచేయా లని.. అందరూ కలిసిపార్టీని గెలిపించాలని ఒకవైపు పార్టీ అధినేత సీఎం జగన్ పదే పదే చెబుతున్నారు. కానీ, దిగువ స్థాయిలో నాయకులు కలిసిపనిచేస్తున్నట్టు ఎక్కడా కనిపించడం లేదు. పైగా.. ఎవరికి వారు.. ఆధిపత్య ధోరణినే ప్రదర్శిస్తున్నారు. ఇదే పరిస్థితి విశాఖపట్నం జిల్లా యలమంచిలి నియోజకవర్గంలో బాహాటంగానే కనిపిస్తోంది. గత మూడేళ్లుగా ఇక్కడ.. మంత్రి అమర్నాథ్ చక్రం తిప్పుతున్నారు.
దీనిని ఫైర్ బ్రాండ్ వైసీపీ నాయకుడు, ఎమ్మెల్యే కన్నబాబు రాజు తిప్పికొడుతూనే ఉన్నారు. అనేక సార్లు.. అధిష్టానానికి కూడా ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ.. అమర్నాథ్ ఎక్కడా వెనక్కి తగ్గకపోగా.. ఎన్నికలకు సమయం చేరువ అవుతున్ననేపథ్యంలో మరింత దూకుడు పెంచడంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అనే చర్చ జోరుగా సాగుతోంది. ఫలితంగా అధికార పార్టీ నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. ఎలమంచిలి ఎమ్మెల్యే యూవీ రమణమూర్తిరాజు(కన్నబాబు), మంత్రి గుడివాడ అమర్నాథ్ ఒకరిపై ఒకరు రగిలిపోతున్నారు.
అమర్నాథ్ మంత్రి అయిన తర్వాత తన ప్రధాన అనుచరుడు, జిల్లా వైసీపీ అధ్యక్షుడు బొడ్డేెడ ప్రసాద్తో కలిసి యలమంచిలి నియోజకవర్గంలో పెత్తనం చెలాయించడం మొదలుపెట్టారు. అప్పటివరకు ఏకఛత్రాధిత్యంగా నడిచిన కన్నబాబు ఇలాకాలో వర్గపోరు మొదలైంది. వివాదాస్పద భూముల విషయంలో రెండు వర్గాలు ఆధిపత్యం కోసం పోటీపడ్డాయి. తాజాగా అచ్యుతాపురం సెజ్లో కొత్తగా నిర్మించబోయే 400 కేవీ విద్యుత్తు ఉపకేంద్రం విషయంలోనూ రెండు వర్గాల మధ్య రగడ నెలకొంది. ఎన్నికలకు ముందు ఇలా ఒకరిపై ఒకరు ఆధిపత్యం చలాయించడంతో కేడర్లో గందరగోళం నెలకొంది.
మరోవైపు.. వచ్చే ఎన్నికల్లో తనకు యలమంచిలి టికెట్ కావాలని.. అమర్నాథ్ కోరినట్టుగా ఆయన వర్గం ప్రచారం చేస్తోంది. కన్నబాబు రాజుకు నోటి దూల ఎక్కువని ఆయన పార్టీలు మారే నాయకుడని.. ఆయ నకు ఓటేస్తే.. ఈ సారి పార్టీ మారిపోతారని.. మంత్రి వర్గం బాహాటంగా చేస్తున్న వ్యాఖ్యలు.. ఎమ్మెల్యే వర్గం లో మంట పుట్టిస్తోంది. దీనిపై కొన్నాళ్ల కిందట ఉత్తరాంధ్ర ఇంచార్జ్గా ఉన్న వైవీ సుబ్బారెడ్డి జోక్యం చేసుకున్నా.. పలితం దక్కక పోగా.. ఇటీవల అమర్నాథ్కు మరో కీలక పదవి దక్కింది. దీంతో ఈ పోరు కు ఇప్పట్లో తాళం పడేలా లేదని.. పార్టీని ఇరువురు నాయకులు ముంచేయడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు.