వలల వాడకంపై విశాఖపట్నం, చీరాల లలో ఘర్షణ వాతావరణం నెలకొని మత్స్యకారుల ఆందోళనలు తీవ్రస్థాయికి చేరడంతో ఏపీ ప్రభుత్వం స్పందించింది.మత్స్యకార గ్రామాల మధ్య నెలకొన్న వివాదాన్ని పరిష్కరించేందుకు తానే స్వయంగా ఒకటి రెండురోజుల్లో ఆయా జిల్లాలకు వెళ్తానని రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు తెలిపారు.
శుక్రవారం రాత్రి ఒక టీవీ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మత్స్యకారుల ఘర్షణల గురించి ,వారు ఎదుర్కొంటున్న వలల సమస్య గురించి విపులంగా మాట్లాడారు. విశాఖపట్నం జిల్లాలో వాడుతున్న రింగు వలలు, వాడరేవు మత్స్యకారులు వాడుతున్న బల్లవలలపై ఆంక్షలు ఉన్న మాట నిజమేనని చెప్పారు. అసలు రింగు వలను పదేళ్ల క్రితమే నిషేధించామని కూడా చెప్పారు.రింగు వలలను ఏకకాలంలో రెండు పడవల నుండి వాడతారని అందువల్ల ఎక్కువ మత్స్యసంపద వలలో పడుతుందని తెలిపారు.ఇది నిషిద్ధమే అయినప్పటికీ ప్రస్తుతం కరోనా కాలంలో మత్స్యకారుల జీవనోపాధి కోల్పోయినందున మళ్లీ ఈ వలలను వాడుతున్నట్టు తన దృష్టికి వచ్చిందన్నారు.
ఈ వలల కన్ను చిన్నదిగా ఉండటం వల్ల చేప పిల్లలు గుడ్లుకూడా వలలో పడతాయని,తద్వారా మత్స్య సంపద ఉత్పత్తి దెబ్బతింటుందన్నారు.అలాగే వలలు,పడవలకు సంబంధించి స్పష్టమైన నిబంధనలు ఉన్నాయని తెలిపారు.మెరైన్ ఫిషరీస్ రెగ్యులేటరీ యాక్ట్ కింద సముద్ర తీరం నుంచి ఎనిమిది కిలోమీటర్ల లోపు మెకనైజ్డు పడవలను,అలాగే అర ఇంచ్ డయామీటర్ కన్నా కన్ను తక్కువ ఉన్న వలలను కూడా వాడరాదని ఆయన స్పష్టం చేశారు.ప్రస్తుతం విశాఖపట్నం వాడరేవులో పరిస్థితి అదుపులోనే ఉందని, వెంటనే ఆయా గ్రామాలకు వెళ్లి వలలను పరీక్షించాల్సిందిగా మత్స్యశాఖ అధికారులకు ఆదేశాలిచ్చామన్నారు ఈ ఘర్షణల్లో రాజకీయ కోణం ఉందని తాను భావించడం లేదన్నారు.
సాధారణంగా అనుమతిలేని వలలను వాడుతున్న మత్స్యకారులపై ఇతర గ్రామాల వారు ఫిర్యాదు చేసినప్పుడు అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకుంటే వారి పైన నిబంధనలు ఉల్లంఘించిన వారు ఆరోపణలు చేయడం సహజమేనన్నారు.వాడరేవులో కూడా ఇదే జరిగింది తాను భావిస్తున్నానని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.ఎంపీ మోపిదేవి వెంకటరమణ ఆమంచి కృష్ణమోహన్ తన దృష్టికి వాడరేవు గొడవకు సంబంధించిన అన్ని విషయాలు తెచ్చారన్నారు.అతి త్వరలో ఈ సమస్యలు పరిష్కరిస్తానని మంత్రి అప్పల్రాజు తెలిపారు.