ఉన్న సమస్యలు చాలంటం లేదో లేక ఇంకా కొత్తవి కావాలని భావిస్తున్నారో తెలియదు కానీ… పరిస్థితులు ఏమాత్రం సహకరించని పరిస్థితుల్లో కూడా వేనకా ముందూ చూసుకోకుండా ప్రవర్తిస్తుతున్నారు టీడీపీ నేతలు. ఒకపక్క అరెస్టులు, మరో పక్క ఎంక్వైరీలు.. మరో పక్క పార్టీని వదిలేస్తున్న నేతలతో ఇప్పటికే టీడీపీ పరిస్థితి అంతంతమాత్రంగా ఉంది. ఇప్పటికే అవినీతి, అక్రమాల కేసులలో అరెస్టయిన తమ కొలీగ్స్ పరిస్థితిని చూసి కూడా మారకపోతే ఎలా? అనే కామెంట్లు బలంగా వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో నిర్భయ చట్టం కేసు నమోదయ్యింది టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడిపై!
అవును… విశాఖ జిల్లా నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్ తోట కృష్ణవేణిని అసభ్యంగా దూషించిన ఘటనకు సంబంధించి టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదైంది. కమిషనర్ ఫిర్యాదు మేరకు నిర్భయ చట్టం కింద ఐపీసీ సెక్షన్ 354–ఎ(4), 500, 504, 5050(1)(బి), 505(2), 506, 509 ప్రకారం కేసు నమోదు చేసినట్లు పోలీస్లు చెబుతున్నారు. మున్సిపల్ కౌన్సిల్ హాల్ ఆధునీకరణ పనులు జరుగుతున్న నేపథ్యంలో అయ్యన్నపాత్రుడి తాత లత్సాపాత్రుడు చిత్రపటాన్ని అధికారులు ఇటీవల చైర్మన్ గదిలోకి మార్చారు. దాంతో.. మనవడికి మండింది!
మరో సమస్యలు ఏమీ లేవన్నట్లుగా… తన తాత ఫోటోను యథాస్థానంలో ఉంచాలని అంటూ అయ్యన్నపాత్రుడు మున్సిపల్ కార్యాలయం వద్ద పార్టీ కార్యకర్తలతో నిరసనకు దిగారు. హాల్ కు రంగులు వేస్తున్నామని నెల రోజుల్లో చిత్రపటాన్ని యథాస్ధానంలో ఉంచుతామని కమిషనర్ వివరణ ఇచ్చినా కూడా అయ్యన్న అయ్యన్న తగ్గలేదు. సరికదా… చిత్రపటాన్ని నెల రోజుల్లో యథాస్థానంలో పెట్టకపోతే కమిషనర్ బట్టలు ఊడదీసే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. అక్కడితో ఆగారా అంటే అదీ లేదు… “కమిషనర్ ఆడ ఆఫీసర్ అయిపోయింది.. అదే మగవాడైతే వేరే విధంగా ట్రీట్మెంట్ ఉండేది…” అంటూ బెదిరించెపనికి పూనుకున్నారు. దీత్మో అయ్యన్నపాత్రుడి దుర్భాషలతో మనస్తాపం చెందిన కమిషనర్… పట్టణ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో నిర్భయ చట్టం కింద కేసు నమోదైంది.