వైసీపీలో కీలక మంత్రి జగన్ కు అత్యంత సన్నిహితుడిగా పేరు మోసిన ఓ యువమంత్రికి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ వస్తుందా ? లేదా అన్న చర్చ సాగుతోంది. కొద్ది రోజుల క్రితమే తన పుట్టినరోజు వేడుకలు కూడా చేసుకున్న సదరు యువ మంత్రి తన సీటు గురించి కూడా నోరు విప్పలేదు. ఇప్పటికే ఆయన సిట్టింగ్ సీటులోకి మరో ఇన్చార్జ్ వచ్చారు. ఇప్పటికే వైసీపీ అధిష్టానం రిలీజ్ చేసిన ఆరు జాబితాలో ఆ యువమంత్రికి మరో నియోజకవర్గం కూడా కేటాయించలేదు. దీంతో సదరు మంత్రి రాజకీయ భవిష్యత్తుపై ఆయన అనుచరులు తీవ్ర ఆందోళనతో ఉన్నారు.
ఆ మంత్రి ఎవరో కాదు విశాఖ జిల్లాకు చెందిన గుడివాడ అమర్నాథ్. ప్రస్తుతం అనకాపల్లి నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే అనకాపల్లికి జగన్ ఇప్పటికే మరో ఇన్చార్జిను నియమించారు. గుడివాడ అమర్నాథ్ నివాసం ఉంటున్న గాజువాక సీటు అయిన ఆయనకు కేటాయిస్తారు అనుకుంటే అక్కడ మరో ఇన్చార్జిను నియమించారు. దీంతో ఆయన ఆశలు పెట్టుకున్న అనకాపల్లి, గాజువాక రెండు సీట్ల లోను పార్టీ తరఫున కొత్త ఇన్చార్జిలు ఉన్నారు. అయితే అమర్నాథ్ చోడవరం నుంచి కూడా పోటీ చేస్తానని తన అనుచరులతో చెబుతున్నారు. అక్కడ సీనియర్ సిట్టింగ్ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఈసారి సీటు తనకే అని తెగేసి చెప్పేశారు. జగన్ సైతం ఆయన మాట కాదనలేకపోయారు.
ఒక దశలో చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీని అనకాపల్లి ఎంపీగా పంపించాలనుకున్నా ఆయన ఒప్పుకోలేదు. దీంతో ఎలమంచిలి నుంచి పోటీ చేయాలని కూడా మంత్రి గుడివాడ చాలా ప్రయత్నాలు చేశారు. అక్కడ సొంత పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే కన్నబాబు రాజుకు మంత్రి గుడివాడకు పెద్ద యుద్ధమే జరిగింది. ఆ సీటు విషయంలో కూడా జగన్ గుడివాడకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు అని తెలుస్తోంది. దీంతొ గుడివాడ పెందుర్తి నుంచి పోటీ చేస్తారు అని తాజాగా వార్తలు వచ్చినా సామాజిక సమీకరణలు వెలమలకు ఛాన్స్ అన్న లెక్కలతో అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే అదీప్రాజ్నే కంటిన్యూ చేస్తారు అని అంటున్నారు. దీంతో గుడివాడ ఆశలు దాదాపుగా ఎమ్మెల్యే సీటు విషయంలో లేవు అనే అంటున్నారు.
అయితే అనకాపల్లి ఎంపీ సీటు నుంచి గుడివాడను పోటీ చేయిస్తారు అని మరో ప్రచారం జరుగుతున్నా అనకాపల్లి ఎమ్మెల్యే టికెట్ కాపులకు ఇచ్చినందువల్ల… గవర సామాజిక వర్గానికి ఎంపీ టికెట్ ఇవ్వాలని జగన్ భావిస్తున్నారు. ఇలా ఓవరాల్గా విశాఖ జిల్లాలో పరిణామాలు చూస్తుంటే గుడివాడకు ఏ నియోజకవర్గంలోనూ ఎమ్మెల్యే సీటు వచ్చే ఛాన్స్ లేనట్టుగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన ఇటీవల మాట్లాడుతూ తన జాతకం జగన్ రాస్తారు అంటూ ఓకింత వైరాగ్యంతో కూడిన రాజకీయ వ్యాఖ్యలు చేశారు.
అందరి రాతలు దేవుడు రాస్తాడని.. తన రాత మాత్రం ముఖ్యమంత్రి జగన్ రాస్తారు అని ఆయన చెప్పిన సంగతి తెలిసిందే. యువనేతగా ఎంతో భవిష్యత్తు ఉన్న నాయకుడిగా గుడివాడకు మంచి అవకాశాలు వచ్చాయి. అయితే జగన్ ఎంతో నమ్మినా ఆయనకు ఇప్పుడు సీటు విషయంలో క్లారిటీ లేకపోవడంతో వచ్చే ఎన్నికల్లో అసలు ఆయనకు సీటు ఉంటుందా ? లేదా పోటీకి దూరంగా ఉండి త్యాగరాజుగా మిగిలి పోవాల్సిందేనా అన్న చర్చిలు కూడా నడుస్తున్నాయి.