ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ దేశవ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు కొత్త ఇంటర్నెట్ కనెక్షన్ ను బుక్ చేయడాన్ని మరింత సులభతరం చేసింది. ఇకపై వినియోగదారులు ఎక్కడికీ వెళ్లకుండా, ఎవరికీ కాల్ చేయకుండానే.. నేరుగా బీఎస్ఎన్ఎల్ సైట్ ద్వారానే కొత్త ఇంటర్నెట్ కనెక్షన్ను బుక్ చేయవచ్చు. బుక్ మై ఫైబర్ పేరిట ఈ సదుపాయాన్ని అందిస్తున్నట్లు బీఎస్ఎన్ఎల్ తెలిపింది.
వినియోగదారులు బుక్ మై ఫైబర్ పోర్టల్(http://bookmyfiber.bsnl.co.in/)లోకి వెళ్లి.. అక్కడ తమ కచ్చితమైన లొకేషన్, సర్కిల్ వివరాలను ఎంటర్ చేయాలి. అనంతరం పిన్ కోడ్, ఫోన్ నంబర్, ఈ-మెయిల్ ఐడీని ఇవ్వాలి. తరువాత ప్రొసీడ్ బటన్ నొక్కాలి. అనంతరం అప్లికేషన్ ఆటోమేటిగ్గా సబ్మిట్ అవుతుంది. అదే సమయంలో ఆ వెబ్సైట్ వినియోగదారుడి అక్షాంశ రేఖాంశాలను (latitude and longitude) ఆటోమేటిగ్గా స్వీకరిస్తుంది. దీంతో వినియోగదారుడి కచ్చితమైన లొకేషన్ బీఎస్ఎన్ఎల్ కు తెలుస్తుంది. దీంతో ఆ సంస్థ ప్రతినిధులకు సర్వీస్ ఎక్కడ ఇవ్వాలో కచ్చితంగా తెలుస్తుంది. ఈ క్రమంలో వారు ఇంటర్నెట్ కనెక్షన్ ప్రక్రియను వేగంగా పూర్తి చేస్తారు.
అలా అప్లికేషన్ సబ్మిట్ చేయగానే.. వినియోగదారుల వద్దకు సంస్థ ప్రతినిధులు వచ్చి కేవైసీ పూర్తి చేసి కొత్త ఇంటర్నెట్ కనెక్షన్ ఇస్తారు. దీనికి సంబంధించిన స్టేటస్ను కూడా ఆ వెబ్సైట్లో వినియోగదారులు ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవచ్చు. బీఎస్ఎన్ఎల్ ఇంటర్నెట్ కనెక్షన్ బుకింగ్లో కస్టమర్లకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, అందుకనే ఈ సులభతరమైన విధానాన్ని అందుబాటులోకి తెచ్చామని ఆ సంస్థ ప్రతినిధి ఒకరు మీడియాకు తెలిపారు.