వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో అయినా.. పరువు దక్కించుకుందామని ప్రయత్నిస్తున్న బీఆర్ ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్కు భారీ ఎదురు దెబ్బతగిలింది. ఇది కూడా కేంద్రంలోని మోడీ కారణంగానే జరిగిందనే ప్రచారం ఊపందుకుంది. పార్లమెంటు ఎన్నికల్లో బీఎస్పీ పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ ప్రయత్నించారు. జానికి.. తెలంగాణలో బీఎస్పీతో కలిసి పని చేయాలని నిర్ణయించుకున్న తర్వాత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో కలిసి కేసీఆర్ చర్చలు జరిపారు. అనంతరం తమ మధ్య గౌరవప్రదమైన పొత్తు కొనసాగుతుందని ప్రకటించారు.
అంతేకాదు, బీఎస్పీ హైకమాండ్తో ప్రవీణ్ కుమార్ మాట్లాడి మరీ అనుమతి తీసుకున్నారని.. ఆ తర్వాతే ఇరు పార్టీలు కలిసి పని చేయాలని నిర్ణయించామని చెప్పారు. నాగర్కర్నూల్ లోక్సభ స్థానంలో బిఎస్పీకి మద్దతు ఇవ్వాలని కూడా డిసైడ్ అయ్యారు. అయితే.. ఇంతలోనే 24 గంటలు కూడా గడవకముందే.. బీఎస్సీ అధినేత మాయావతి ఢిల్లీలో సంచలన ప్రకటన చేశారు. తాము ఏపార్టీతోనూ పొత్తు పెట్టుకోవడం లేదన్నారు. అంతేకాదు.. ఎక్కడా ఏ రాష్ట్రంలోనూ తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని చెప్పేశారు. దీనికితోడు.. కేసీఆర్తో ప్రవీణ్ కుమార్ భేటీ విషయాన్ని అసలు తనకు తెలియదు.. అన్నట్టుగా వ్యాఖ్యానించారు.
మొత్తంగా ఈ పరిణామాలను గమనిస్తే.. బీఎస్పీ ప్రకటన వెనుక ఖచ్చితంగా మోడీ బృందం ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. గతంలో ఆమెను యూపీ ఎన్నికల నుంచి కూడా బీజేపీ నియంత్రిస్తోంది. అప్పటి అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్ వాదీతో పొత్తు పెట్టు కుని ముందుకు సాగాలని మాయావతి భావించారు. అదేసమయంలో కాంగ్రెస్తోనూ కలవాలనుకున్నారు. కానీ, అనూహ్యంగా బీజే పీ ఎంటరైంది. దీంతో ఆమె ఎవరితోనూ పొత్తులు పెట్టుకోవడం కాదు.. అసలు అసెంబ్లీ ఎన్నికల నుంచి తప్పుకొంటున్నామని ప్రకటించింది. ఇప్పుడు కూడా ఇదే సూత్రం ప్రకారం.. మోడీతో వైరమున్న కేసీఆర్తో జట్టు కట్టడానికి బీజేపీ నియంత్రించి ఉంటుందనే చర్చ సాగుతోంది.
బీఎస్పీ ఎందుకు వినాలి…
బీఎస్పీ అధినేత్రి మాయావతి.. బీజేపీ మాట ఎందుకు వినాలి? ఆ పార్టీ నియంత్రణలోకి ఎందుకు వెళ్లాలి? అనే చర్చ సహజంగా నే తెరమీదికి వచ్చింది. ఆమె ఉత్తరప్రదేశ్ను పాలించిన సమయంలో పార్టీ గుర్తయిన ఏనుగు విగ్రహాలను పెట్టించి.. భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. ఇక, పాలనలోనూ అనేక అక్రమాలు జరిగాయనే కేసులు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వీటిని సీబీఐ విచారిస్తోంది. దీంతో బీజేపీ కన్నెర్ర చేస్తే.. ఆమె కటకటాల వెనక్కి వెళ్లడం ఖాయం. అందుకే మౌనంగా మోడీని ఫాలో అవుతున్నారని అంటున్నారు.