గతకొన్ని రోజులుగా వైఎస్సార్సీపీలో రఘురామకృష్ణంరాజు వ్యవహారం ముదిరి పాకానపడుతుంది. జగన్ తనకు ప్రత్యేకంగా అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదు అన్నదగ్గరి నుంచి మొదలైన ఈ వ్యవహారం రఘుకి షోకాజ్ నోటీసులు ఇచ్చేవరకూ వెళ్లింది. ఇదంతా ఒకెత్తు అయితే… ఆ షోకాజ్ నోటీస్ లెటర్ హెడ్ వ్యవహారం మరొకెత్తు! తాజాగా ఈ వ్యవహారం కొత్త పుంతలు తొక్కుతుంది!
నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరిస్తూ వైకాపా నేతలకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు! ప్రజలకోసం, హిందువుల మనోభావాలకోసం, జగన్ కోసం అంటూ.. పార్టీని ఇబ్బందుల్లో పెట్టే విషయాలను మీడియా ముఖంగా ప్రస్థావిస్తూ… పార్టీకి తనవంతు డ్యామేజ్ తాను చేస్తున్నాడు! ఈ క్రమంలో విజయసాయి పేరున వచ్చిన షోకాజ్ నోటీస్ వ్యవహారం ప్రస్తుతం హస్తినలో హల్ చల్ చేస్తుంది.
తనకు బీ-ఫారం ఇచ్చింది యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ అని.. కానీ తనకు షోకాజ్ నోటీసు ఇచ్చింది మాత్రం వైఎస్సార్సీపీ అని చెప్పిన సమయంలో… అన్నా వైఎస్ఆర్ పార్టీ అధినేత బాషా ఢిలీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ వెనకున్నది ఆర్.ఆర్.ఆర్ అని వస్తున్న వార్తల సంగతి కాసేపు పక్కనపెడితే… ఈ పిటిషన్ పై స్పందించిన కోర్టు విచారణను సెప్టెంబర్ 3కు వాయిదా వేస్తూ.. అప్పటిలోగా కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ఆదేశించింది.
ఫలితంగా… ఈ కోర్టు వ్యవహారంలో పాత్రదారి బాషా అయినా… సూత్రదారి మాత్రం రఘురామకృష్ణంరాజే అనే విషయంలో వైకాపాకి చాలా స్పష్టత ఉంది! దీంతో… నమ్మలేని దార్లో దూసుకొచ్చిన ఆర్.ఆర్.ఆర్. పార్టీకి షాకుల మీద షాకులు ఇస్తున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు! ఇదేక్రమంలో… “విజయసాయి రెడ్డికి తెలిసే ఆ లెటర్ హెడ్ పై షోకాజ్ నోటీసులు ఇచ్చాడు. పరోక్షంగా జగన్ ను ఇబ్బందిపెట్టాలన్నదే సాయిరెడ్డి స్కెచ్.. అందులో భాగంగానే వైఎస్సార్సీపీ లెటర్ హెడ్” అనేస్థాయిలో కూడా కామెంట్లు పడుతుండటం కొసమెరుపు!